హుస్నాబాద్, డిసెంబర్ 15: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామ శివారులో రాష్ట్ర కూటుల పాలన నాటి జైన శిల్పాలు వెలుగుచూశాయి. పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తన బృందంతో కలిసి బుధవారం ఈ శిల్పాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో మోయెతుమ్మెద వాగుకు కుడి ఒడ్డున గల తోళ్లబండ సమీపంలోని బాలకృష్ణారెడ్డి పొలంలో రెండుచోట్ల జైన చౌముఖ శిల్పాలను గుర్తించినట్టు చెప్పారు.
మూడు అడుగుల ఎత్తు, ఆరున్నర అడుగుల వెడల్పుతో ఉన్న గ్రానైటుపై నాలుగు వైపులా నలుగురు జైన తీర్థంకరుల శిల్పాలు చెక్కి ఉన్నాయన్నారు. వాటిని ఆదినాథ, నేమినాథ, పార్శనాథ, మహావీరులుగా గుర్తించినట్టు తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ శిల్పాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని శివనాగిరెడ్డి సూచించారు.