గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నగరంలో డయేరియా విజృంభించింది. శారదా కాలనీలో కలుషితమైన మున్సిపల్ నీళ్లు తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో పద్మ అనే మహిళ మృతి చెందింది. మరో 10 మంది జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు.
జనసేన, తెదేపా నాయకులు ఘటనా ప్రాంతానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం జీజీహెచ్ ఆస్పత్రి వద్దకు వెళ్లి మృతురాలు పద్మ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తరలించవద్దంటూ నిరసన చేపట్టారు. తాగునీరు సరిగా ఇవ్వలేని కమిషనర్ ఎందుకని ప్రశ్నించారు.
మరోవైపు కమిషనర్ చేకూరి కీర్తి కూడా ఘటనా ప్రాంతానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీలో కలుషిత నీరు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. ఇదిలావుంటే మూడు రోజుల క్రితం కూడా డయేరియాతో సంగడి గుంటకు చెందిన కొర్రపాటి ఓబులు మృతి చెందారు.