న్యూఢిల్లీ: పెద్ద మొత్తంలో డీజిల్ను వినియోగించే బల్క్ యూజర్లకు ధరల సెగ తగిలింది. అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 40 శాతం పెరిగిన నేపథ్యంలో దేశీయంగా బల్క్ యూజర్లకు హోల్సేల్గా విక్రయించే డీజిల్ ధర లీటరు రూ.25 పెరిగింది. సామాన్య ప్రజలకు మాత్రం ఈ ధరల సెగ ఇంకా తగలలేదు. రిటైల్ డీజిల్ ధరలు (పెట్రోల్ బంకు ధరలు) యథావిధిగా ఉన్నాయి.
ప్రస్తుతం ముంబైలో పెట్రోల్ బంక్ వద్ద లీటరు డీజిల్ ధర రూ.94.14గా ఉంటే, బల్క్ యూజర్లకు విక్రయించే డీజిల్ ధర లీటరుకు రూ.97గా ఉండేది. తాజా నిర్ణయంతో బల్క్ యూజర్లకు విక్రయించే డీజిల్ ధర లీటరుకు రూ.122.05కు పెరిగింది. వాస్తవానికి బల్క్ యూజర్లకు విక్రయించే చమురు ధరలు.. రిటైల్ ధరలతో పోల్చితే ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ అధిక ధరను తప్పించుకోవడానికి బల్క్ యూజర్లు కూడా పెట్రోల్ పంపుల వైపు మళ్లుతున్నారు. కాగా, బల్క్ యూజర్లకు ధర పెంచడం సాధారణ ప్రజలు వినియోగించే ఇంధన ధరల పెంపునకు సంకేతమని నిపుణులు చెప్తున్నారు.