న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఇంధన ధరల పెరుగుదలతో సామాన్యుడు కుదేలవుతున్నాడు. లీటరు పెట్రోల్పై మూడ్రోజులకు సగటున రూపాయి చొప్పున వడ్డిస్తున్న కేంద్రం.. తాజాగా మళ్లీ పెట్రోబాదుడుకు పూనుకున్నది. లీటరు పెట్రోల్, డీజిల్పై 35 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ. 107.94, ముంబైలో రూ.113.80, హైదరాబాద్లో రూ. 112.27కు చేరింది. ఇక ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ. 96.67, ముంబైలో రూ.104.75, హైదరాబాద్లో రూ. 105.46గా ఉన్నది. మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లా కేంద్రంలో లీటరు పెట్రోల్ అత్యధికంగా రూ.120.40కు చేరగా, లీటరు డీజిల్ ధర రూ.110కి చేరింది. గడిచిన నెల రోజుల్లో పెట్రోల్ రేటును 22 దఫాల్లో రూ.6.75 వరకు పెంచగా, డీజిల్ రేటును 24 విడతల్లో రూ.8.05 పెంచారు. ఒక్క అక్టోబర్ నెలలోనే 19సార్లు పెట్రో ధరలను పెంచారు.
ధరల పెంపుతో సామాన్యుడు బెంబేలు
పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడిపై విపరీతమైన ఆర్థిక భారం పడుతున్నది. పెట్రోల్కు నెలకు రూ.1,000పైనే అదనపు ఖర్చు చేయాల్సి వస్తున్నది. అంతేగాక సరుకు రవాణా ఖర్చు పెరుగడంతో వ్యాపారులు కూరగాయలు, నిత్యావసరాల ధరలను పెంచారు. దీంతో కూరగాయలకు నెలకు దాదాపు రూ.1,000, నిత్యావసరాలకు నెలకు రూ.1,500 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. మరోవైపు హోటళ్లు కూడా టిఫిన్కు రూ.5 నుంచి రూ.10, ప్లేట్ భోజనానికి దాదాపు రూ.20 పెంచాయి.