అమరావతి : అమరావతి రైతుల మహాపాదయాత్రకు నెల్లూరు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ చేపట్టిన పాదయాత్ర శనివారం 27వరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నెల్లూరు పట్టణంలోని జెట్టి శేషరెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర సుమారు 12 కిలోమీటర్ల వరకు సాగనుంది.
భారీ వర్షంలోనూ రైతులు నినాదాలు చేస్తు పాదయాత్రను కొనసాగిస్తుండగా నెల్లూరు చేనేత సమాఖ్య ప్రతినిధులు, నేతన్నలు పాదయాత్ర చేస్తున్న మహిళలకు చీరలను పంచి పెట్టారు. అయితే కోవూరు ప్రాంతంలోని వరద ముంపు ప్రాంతాల మీదుగా వెళ్తున్న పాదయాత్ర చేస్తున్న రైతులు..ఆ చీరల్ని అక్కడ నిరాశ్రయులకు పంచిపెట్టి మానవత్వం చాటారు.
మహాపాదయాత్రకు వివిధ ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదులు, నెల్లూరు నాయిబ్రాహ్మణుల సంఘం నాయకుడు సంఘీభావం తెలిపారు. కొందరూ దాతలు సైతం ముందుకు వచ్చి అమరావతి రైతులకు మద్దతు తెలియజేస్తూ విరాళాలను అందజేస్తున్నారు.