లక్నో : యూపీలో సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే యూపీ దేశమంతటా ఉగ్రవాదాన్ని సరఫరా చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏటా రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందచేస్తామని చెప్పారు. అఖిలేష్ యాదవ్ హయాంలో 2000 మంది రైతులు ఆకలితో మరణించారని గుర్తుచేశారు. బందా జిల్లాలోని తిండ్వారి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో శనివారం అమిత్ షా మాట్లాడుతూ యూపీలో బాహుబలి ఎవరూ లేరని కేవలం ఓ భజరంగబలి ఉన్నాడని సీఎం యోగి ఆదిత్యానాధ్ను ఉద్దేశించి అన్నారు. శాంతి భద్రతల పరిస్ధితిపై విపక్షాల విమర్శలు అర్ధం లేనివని తోసిపుచ్చారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దోపిడీలు 72 శాతం తగ్గాయని, హత్యలు 31 శాతం, కిడ్నాప్లు 29 శాతం, లైంగిక దాడులు 50 శాతం తగ్గాయని చెప్పారు. ఇక అంతకుముందు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయం సాధిస్తే ఏటా దీపావళి, హోళి పండుగల సందర్భంగా ఉచిత ఎల్పీజీ సిలిండర్ అందిస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ పేర్కొన్నారు.
గొండాలోని కొలనెల్గంజ్లో శనవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో మంత్రి మాట్లాడుతూ యూపీలో బీజేపీ తిరిగి పాలనా పగ్గాలు చేపడితే ప్రతి సంవత్సరం దీపావళి, హోళి రోజున ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అందచేస్తామని రాజ్నాధ్ సింగ్ హామీ ఇచ్చారు. మరోవైపు లఖింపూర్ ఖేరి ఘటన విషయంలో ప్రజలు బీజేపీని మరిచిపోరని సమాజ్వాది పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓ న్యూస్ చానెల్తో మాట్లాడుతూ కాషాయ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతకుముందు కన్నౌజ్లో జరిగిన ర్యాలీలో యోగి, మోదీ సర్కార్లపై అఖిలేష్ యాదవ్ ఘాటు విమర్శలు చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మెరుగైన ఫలితాలు రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. యూపీలో ముగిసిన రెండు దశల పోలింగ్లో ఎస్పీ కూటమి సెంచరీ స్ధానాల్లో పాగా వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కన్నౌజ్లోనూ తమను ప్రజలు ఆదరిస్తే కాషాయ పార్టీని మట్టికరిపిస్తామని చెప్పారు.
బీజేపీ కర్హల్ అభ్యర్ధి ఎస్పీఎస్ బాఘేల్, బీజేపీ ఎంపీ గీతా షక్యలపై దాడుల గురించి కాషాయ పార్టీ గగ్గోలు పెడుతోందన్న అఖిలేష్ ఓటమి భయంతోనే బీజేపీ తమ నేతలపై తమ పార్టీ వారితోనే దాడులు చేయించుకుని హంగామా చేస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర బలగాలతో పాటు శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన యూపీ ప్రభుత్వం ఏం చేస్తోందని అఖిలేష్ నిలదీశారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. మరోవైపు ఎన్నికల్లో గెలుపొంది మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులొడ్డి పోరాడుతుండగా, యోగి సర్కార్పై వ్యతిరేకతతో అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ చెమటోడుస్తోంది. ప్రధాన పార్టీలకు దీటుగా పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్, బీఎస్పీలు పావులు కదుపుతున్నాయి. మరోవైపు కుటుంబ పార్టీ ఎస్పీకి ప్రజా సంక్షేమం పట్టదని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ మండిపడ్డారు. ఝాన్సీలో గురువారం జరిగిన ర్యాలీలో ఎస్పీ, కాంగ్రెస్ లక్ష్యంగా యూపీ సీఎం ఆరోపణలు గుప్పించారు.