కాబూల్ : తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించిన రోజు రోజుకు అమెరికాతో సహా పలు దేశాలకు కష్టాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘన్లో పలు దేశాల పౌరుల భద్రతకు ముప్పు ఏర్పడింది. ఈ క్రమంలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. కాబూల్ ఎయిర్పోర్టులో యూఎస్ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిర్పోర్ట్ గేట్ వెలుపల ఉన్న తమ పౌరులను వెంటనే ఆ ప్రదేశాన్ని వీడి వెళ్లిపోవాలని, తప్పనిసరిగా సూచనలు పాటించాలని విదేశాంగ శాఖ ఆదేశించింది. కాబూల్లోని యూఎస్ రాయబార కార్యాలయం అబ్బే గేట్, ఈస్ట్ గేట్, నార్త్ గేట్ వద్ద ఎవరైనా అమెరికన్ పౌరులుంటే ఆయా ప్రదేశాలను ఖాళీ చేయాలని చెప్పింది.
కాబూల్ విమానాశ్రయం వెలుపల ఉన్న అమెరికా పౌరులు విమానాశ్రయం వైపు ప్రయాణించొద్దని సూచించినట్లు రాయబార కార్యాలయం తెలిపింది. యూఎస్ ప్రభుత్వ ప్రతినిధి వ్యక్తిగతంగా సంప్రదించి కోరితే తప్పా.. ఎయిర్పోర్ట్కు రావొద్దని స్పష్టం చేశారు. మరో వైపు బ్రిటన్ సైతం విమానాశ్రయం వైపు వెళ్లొద్దని పౌరులకు సూచించింది. విమానాశ్రయ ప్రాంతం నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు వేచి ఉండాలని చెప్పారు. అయితే, ఆఫ్ఘనిస్తాన్లో బ్రిటిష్ పౌరుల సంఖ్యపై ఖచ్చితమైన సమాచారం ఇంకా అందుబాటులో లేదు.
బ్రిటన్ సైన్యం ఇటీవల వేలాది మంది 7వేల మంది బ్రిటిష్ పౌరులు సహా 11వేల మందికిపైగా ప్రజలను ఆఫ్ఘన్ నుంచి ఖాళీ చేయించింది. మరో వైపు ఆస్ట్రేలియా సైతం విమానాశ్రయ ప్రాంగణంలో ఉన్న ఆస్ట్రేలియన్లు సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలని చెప్పింది. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ గత వారం బుధవారం నుంచి ఆస్ట్రేలియా దాదాపు 4వేల మందిని విమానాశ్రయం నుంచి తరలించినట్లు చెప్పారు. నిన్న రాత్రి 1200 మందిని తరలించామని వివరించారు.