మెదక్, డిసెంబర్ 6 : ప్రపంచంలోనే అతి పెద్ద భారత రాజ్యాంగాన్ని లిఖించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్ అన్నారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంటరానితనం, కుల నిర్మూలనకు అంబేద్కర్ ఎంతో కృషి చేశారని అన్నారు. రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, సంఘ సంస్కర్తగా, మహామేధావిగా అంబేద్కర్ చరిత్రలో నిలిపోయారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్, జిల్లా షెడూల్డ్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా ఖజానా అధికారి చిన్న సాయిలు, బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మనోహరాబాద్/రామాయంపేటలో..
మనోహరాబాద్/రామాయంపేట, డిసెంబర్ 6 : రామాయంపేట, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి ఘనం గా నిర్వహించారు. రామాయంపేటలోని అంబేద్కర్ యూ త్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మనోహరాబాద్ మండలం దండుపల్లిలో ఐటీసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, గౌతోజిగూడెంలో సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు అశోక్, నరేందర్, కాశీ, స్వామి, మహేశ్, సతీశ్, మాల మహానాడు అధ్యక్షుడు సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ అర్బన్లో..
మెదక్ అర్బన్, డిసెంబర్ 6 : మెదక్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ సంతోష్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి న్యాయవాదులు నివాళులర్పించారు. అ నంతరం సీనియర్ న్యాయవాది జనార్దన్రెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు రవీందర్, రాజీరెడ్డి, రామ్శర్మ, బాలయ్య, శోభన్గౌడ్, రాములు, సిద్ధిరాములు, రాజారాం, మధుకిరణ్, వెంకటేశ్, శ్రీనివాస్గౌడ్. రవి, అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ రూరల్లో..
మెదక్ రూరల్, డిసెంబర్ 6 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సోమవారం మెదక్ మండల పరిధిలోని తిమ్మకపల్లి ప్రాథమిక పాఠశాలలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి కృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేశ్రెడ్డి, ప్రభాకర్, విద్యార్థులు పాల్గొన్నారు.