అమరావతి : తెలుగుదేశం నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన భాషను చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్ర డీజీపీని పాలేరు అంటూ వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలోనూ డీజీపీ పనిచేశారని, ఓ ఐపీఎస్ అధికారిని ఇలా మాట్లాడడం హేయం అన్నారు. టీడీపీ నేతలు ప్రజల సింపతి కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్పై నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ పనైపోయిందని, ఎన్ని కొంగ జపాలు చేసిన ప్రజలు నమ్మరన్నారు. ‘పట్టాభి మాట్లాడింది తప్పు’ అని చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులను తక్కువ చేసి మాట్లాడితే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్సార్సీపీని, ముఖ్యమంత్రిని తిట్టడం తప్పని చెప్పి నిరాహార దీక్షకు కూర్చోవాలన్నారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలపై చట్టప్రకారం చర్యలుంటాయన్నారు.