శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి అమావాస్య ప్రదోషకాలంలో జరిగే అభిషేకంలో భకులు పాల్గొనే అవకాశాన్ని పరోక్ష సేవ ద్వారా కల్పిస్తున్నుట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. లోకకళ్యాణార్ధం ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో స్వామివారికి అభిషేకార్చనలు నిర్వహిస్తున్నప్పటికీ దేశ విదేశాలలో ఉండే శివసేవకుల అభ్యర్థన మేరకు క్షేత్రపాలకునికి జరిగే షోడశోపచార క్రతువులలో భాగస్థులు అయ్యే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.
ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజుల్లో సేవాకర్తలు తమ గోత్రనామాలను srisailadevasthanam.org వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని శ్రీశైల టీవీ ఛానల్ సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు శ్రీశైలప్రభ సంపాదకుడు అనీల్ కుమార్ తెలిపారు. దేవస్థానం వివరాలను తెలుసుకునేందుకు కాల్ సెంటర్ 89999 01851/2/3/4/5/6 నంబర్లలో సంప్రదించవలసిందిగా కోరారు.