హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజన దాదాపు పూర్తికావొచ్చింది. పలుశాఖల్లోని ఉద్యోగుల విభజన పూర్తయింది. సోమవారం అర్ధరాత్రి 11 గంటల తర్వాత టీచర్లకు కేటాయింపు ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఉద్యోగుల వ్యక్తిగత సెల్ఫోన్లకు కేటాయింపు సమాచారాన్ని పంపించారు. ఉద్యోగుల సీనియారిటీ ఆధారంగా వారు ఎంచుకున్న ఆప్షన్లను బట్టి కేటాయింపు పూర్తిచేశారు. ఆయా ఉద్యోగులంతా మూడురోజుల్లోగా కేటాయించిన జిల్లాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేశారు.
నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజన, కేటాయింపును ఇటీవల చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు జీవో -317 ద్వారా మార్గదర్శకాలను విడుదల చేయడమే కాకుండా, విభజన, కేటాయింపునకు షెడ్యూల్ను సైతం విడుదల చేశారు. ఆయా షెడ్యూల్ ప్రకారం సీనియారిటీ జాబితాలు సిద్ధంకాగా, ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించారు. ఇందు కోసం జిల్లా, జోనల్, మల్టీజోనల్ స్థాయిలో ఉద్యోగుల కేటాయింపు కమిటీలు ఏర్పాటుకాగా, ఈ కమిటీలు ఉద్యోగులిచ్చిన ఆప్షన్ల ప్రకారం కేటాయింపు పూర్తిచేశాయి.
ఆయా వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో అప్లోడ్చేశారు. ఈ పోర్టల్ ద్వారానే ఉద్యోగుల కేటాయింపు ఉత్తర్వులను ఉద్యోగుల సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్ రూపంలో పంపించారు. ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా లింక్ను సైతం పంపించారు. లింక్ ద్వారా ఆర్డర్ కాపీని ప్రింట్ తీసుకొని, కేటాయించిన జిల్లాల్లో గడువులోగా రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.