నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లాలో రిటైల్ మద్యం దుకాణాలను 2021-23 సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీలు, గౌడ కులస్తులకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ననుసరించి రిజర్వేషన్ మేరకు లాటరీ ద్వారా కేటాయించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బి.సి. అభివృద్ధి అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ డ్రా ద్వారా మద్యం షాపులను కేటాయించారు.
జిల్లాలో 155 రిటైల్ మద్యం షాపులకు గాను ఎస్టీలకు 4, ఎస్సీలకు 14, గౌడ సామాజిక వర్గాలకు 34 రిటైల్ మద్యం షాపులు కలెక్టర్ డ్రా తీసి కేటాయించారు. 155 మద్యం దుకాణాల లో 52 దుకాణాలు ఎస్సీ, ఎస్టీలు, గౌడ కులస్తులకు ప్రభుత్వ ఎక్సైజ్ కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాల ననుసరించి కేటాయించగా 103 మద్యం షాపులు జనరల్ కేటగిరి కింద మిగిలినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జి.అంజన్ కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై.హిమశ్రీ, సాంఘిక సంక్షేమ శాఖ డి. డి. సల్మా భాను, జిల్లా బి.సి.అభివృద్ధి అధికారిణి కృష్ణ వేణి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.