వేల్పూర్/ మోర్తాడ్/తుంగతుర్తి, నవంబర్11: టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు గులాబీ పార్టీలో చేరుతున్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం సుకెంట్ గ్రామంలోని కుమ్మరి, విశ్వబ్రాహ్మణ, మేర సంఘాలకు చెందిన ప్రతినిధులు వేల్పూర్లోని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నివాసంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ఎస్సీ కాలనీకి చెందిన 100 మంది గురువారం ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులపై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని స్పష్టంచేశారు.
బోధన్: తెలంగాణ సామాజిక పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పు సంతోష్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరారు. గురువారం రాత్రి బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్.. ఉప్పు సంతోష్కు గులాబీ కండువా కప్పారు. తెలంగాణ సామాజిక పోరాట సమితిని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు ఉప్పు సంతోష్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గతంలో టీఆర్ఎస్లో పనిచేశానని, తిరిగి అదే పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉన్నదని చెప్పారు.