హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: పదోన్నతుల్లో ఓబీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించాలని, క్రీమీలేయర్ను తొలగించాలని అఖిల భారత ఓబీసీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. కులాలవారీగా జనగణన చేపట్టాలని, దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. లేకుంటే మోదీ సర్కార్పై తిరుగుబాటు తప్పదని హెచ్చరించాయి. ఈ మేరకు ఆదివారం చెన్నైలో జరిగిన ఓబీసీ ఉద్యోగుల జాతీయ స్థాయి సమావేశం తీర్మానం చేసింది.
29 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు, బీసీ సంఘాల నేతలు, అఖిలపక్ష రాజకీయ నాయకులు, 30 ఓబీసీ ఉద్యోగ సంఘాల నాయకులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్కృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నీరడి భూపేశ్సాగర్ తదితరులు హాజరైయ్యారు. పదోన్నతుల్లో బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యంగపరమైన న్యాయపరమైన అవరోధాలేమీ లేవని స్పష్టం చేశారు.
బీసీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, ఎలాంటి పథకాలు, రాయితీలు కల్పించడం లేదని ధ్వజమెత్తారు. విద్యా, ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్లపై క్రీమీలేయర్ నిబంధన విధించడం బీసీల పట్ల వివక్ష చూపడమేనని పేర్కొన్నారు. బీసీలందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని, మిలిటెంట్ తరహాలో ఉద్యమిస్తే తప్ప కేంద్రం దిగిరాదని తెలిపారు.