కేంద్రానికి రైతు నేత టికాయిత్ హెచ్చరిక
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులను బలవంతంగా తరలించాలని ప్రయత్నిస్తే ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని రైతు నేత రాకేశ్ టికాయిత్ హెచ్చరించారు. రైతులను అక్కడి నుంచి పంపిస్తే దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను మార్కెట్లుగా మార్చేస్తామని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నిరసన కేంద్రాల్లో రైతులు వేసిన టెంట్లు తొలగిస్తే అవే టెంట్లను పోలీస్ స్టేషన్లలో, కలెక్టరేట్లలో వేస్తామని పేర్కొన్నారు. గాజీపూర్, టిక్రి సరిహద్దుల్లో పోలీసులు బ్యారికేడ్లు తొలగించిన రెండు రోజుల్లోనే రాకేశ్ టికాయిత్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.