నిర్మల్, నమస్తే తెలంగాణ, మార్చి 6 : రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే వైద్య సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వ దవాఖానల్లో పలు కీలక విభాగాలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా నిర్మల్లోని జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన పాలియేటీవ్ కేర్ సెంటర్.. దీనావస్థలో ఉన్న రోగులకు అండగా నిలువనున్నది. రెండు రోజుల క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు.. స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి ఇక్కడి దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన పాలియేటీవ్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. ‘ఆలన, ఆరాధన, సేవ’ నినాదంతో ఈ సెంటర్లో మూడు విభాగాలను ఏర్పాటు చేశారు. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ విభాగాలతో పాటు హోమ్కేర్ విభాగాల ద్వారా అవసరమైన రోగులకు సేవలు అందించనున్నారు. ఈ పాలియేటీవ్ సెంటర్లో మొత్తం ఆరు పడకలను ఏర్పాటు చేశారు. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతూ.. ఇక వైద్యం చేయలేని పరిస్థితిలో ఉన్న రోగులందరినీ ఈ కేంద్రం అక్కున చేర్చకోనున్నది. ఇంటి వద్ద తాము అనుభవిస్తున్న రోగాల కారణంగా కుటుంబ సభ్యులు పట్టించుకోని వారు, రోగాలతో నిర్లక్ష్యానికి గురవుతున్న వారు ఈ సెంటర్ను ఆశ్రయించవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ ఈ సెంటర్ ద్వారా అవసరమైన కౌన్సెలింగ్ ఇచ్చి మానసికంగా, శారీరకంగా ఉపశమనం కల్పించనున్నారు. ఇందుకోసం ఒక ఫిజియోథెరపిస్టుతో పాటు ఒక డాక్టర్, నలుగురు పారామెడికల్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. వీరు 24 గంటల పాటు దీనావస్థలో ఉన్న రోగులకు అవసరమైన వైద్య చికిత్స అందజేస్తూ, ఉపశమనం కలిగించే పద్ధతుల్లో సేవలు అందిస్తారు. ఇలాంటి సదుపాయాన్ని నిర్మల్లో ఏర్పాటు చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
క్యాన్సర్, పక్షవాతం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ చివరి దశలో ఉన్న వారికి ఈ పాలియేటీవ్ కేర్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. క్యాన్సర్ పేషంట్లకు కీమోథెరపీ చేయడంతో విపరీతమైన నొప్పులు ఉంటాయి. వాటి నుంచి ఉపశమనం కలిగించేందుకు హైదరాబాద్ లాంటి చోట్ల మాత్రమే దొరికే మార్ఫిన్ డ్రగ్ను ఇక్కడ ఇస్తారు. దీంతో వారికి బాధ తెలియకుండా చివరి దశలో ప్రశాంతంగా గడిపే అవకాశం కలుగుతుంది. ఎవరి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉండి, ఇంట్లో వారికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నవారు ఈ సెంటర్ను వినియోగంచుకోవాలి. ఇక్కడ మూడు పూటలా భోజనంతో పాటు 24 గంటలు సపర్యలు చేసేందుకు సిబ్బంది ఉంటారు.
– డాక్టర్ ఆశిష్రెడ్డి, ప్రోగ్రాం అధికారి
అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ.. చివరి దశలో వారిని పట్టించుకునే వారు ఉండరు. అలాంటి వారికి మేము అండగా ఉంటూ వారిలో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తాం. వారు సంతోషంగా ఉన్నప్పుడు మాపై ఎంతో కృతజ్ఞతా భావాన్ని చూపిస్తారు. అది మాకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తినిస్తుంది. అది మాటల్లో చెప్పలేం.
– అపర్ణ, స్టాఫ్ నర్స్, పాలియేటీవ్ కేర్ సెంటర్
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కుటుంబ సభ్యులు పట్టించుకోలేని వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి ఆలనాపాలన చూసేందుకు నిర్మల్ జిల్లా దవాఖానలో పాలియేటీవ్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. ‘ఆలన, ఆరాధన, సేవ’ నినాదంతో మూడు విభాగాలను ఏర్పాటు చేశారు. ఇన్, అవుట్ పేషెంట్ విభాగాలతోపాటు హోమ్కేర్ ద్వారా సేవలు అందించనున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అవసరమైన కౌన్సెలింగ్ ఇచ్చి మానసికంగా, శారీరకంగా ఉపశమనం కల్పించనున్నారు. ఇందుకోసం ఒక ఫిజియోథెరపిస్టుతోపాటు ఒక డాక్టర్, నలుగురు పారామెడికల్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. వీరు 24 గంటలు అందుబాటులో ఉండనున్నారు.