Airport Metro | ఎయిర్పోర్టు మెట్రో కారిడార్లో అత్యంత కీలకమైన మెట్రో డిపో ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐటీ కారిడార్లోని రాయదుర్గం నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయం ప్యాసింజర్ టర్మినల్ వరకు 31 కి.మీ మేర మెట్రో ఎక్స్ప్రెస్ మార్గాన్ని 9 మెట్రో స్టేషన్లతో నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనులను ఈపీసీ విధానంలో చేపట్టేందుకు టెండర్ను హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) పిలిచింది. గత ఏడాది డిసెంబర్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మెట్రో పనులకు శంకు స్థాపన చేసిన నాటి నుంచి క్షేత్ర స్థాయిలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 31 కి.మీ పొడవునా ఉన్న మెట్రో మార్గంలో సర్వే చేపట్టి మెట్రో పిల్లర్ల నిర్మాణం కోసం అవసరమైన మట్టి పరీక్షలను చేపట్టారు. ఒకవైపు ఈ పనులు కొనసాగుతుండగా, మరోవైపు ఇతర ఏర్పాట్లపైనా మెట్రో అధికారులు దృష్టి సారించారు.
ఎయిర్పోర్టులో కాకుండా మరో చోట
మెట్రో ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నా, పనుల ప్రారంభానికల్లా అత్యంత కీలకమైన డిపో, ఆపరేషన్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో రైళ్లను నిలిపి ఉంచేందుకు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేయాల్సి ఉంది. ప్రాథమికంగా ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్టులోనే డిపోను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా, ప్రత్యామ్నాయంగా మరో చోటును ఎంపిక చేసే పనిలో ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులోని స్థలం జీఎంఆర్ పరిధిలో ఉండడంతో దాని వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, ఆర్థిక భారాన్ని అంచనా వేసి, దానికి బదులుగా పూర్తిగా ఈ మార్గంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని డిపోకు, ఆపరేషన్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం ఎంపిక చేస్తే బాగుంటుందనే ఆలోచనతో అధికారులు రెండు చోట్ల స్థలాలను పరిశీలించారు.
మెట్రో డిపో ఏర్పాటుపై తుది కసరత్తు…
ఈ స్థలం రాయదుర్గం నుంచి నానక్రాంగూడ ఓఆర్ఆర్ మీదుగా వెళ్లే మార్గంలో హిమాయత్సాగర్, రాజేంద్రనగర్, బుద్వేల్ ప్రాంతాల మధ్య, కొత్వాల్గూడ-శంషాబాద్ల మధ్య తగినంత స్థలం అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. సుమారు 40 నుంచి 50 ఎకరాల స్థలాన్ని మెట్రో డిపో, ఇతర కార్యకలాపాలకు అవసరం ఉంటుందని మెట్రో అధికారులు ప్రాథమికంగా నిర్ణయించుకొని స్థలాన్వేషణ చేస్తున్నారు. ప్రస్తుతం ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని హిమాయత్సాగర్-బుద్వేల్ ప్రాంతంలో 80 ఎకరాల వరకు స్థలం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ స్థలం ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఉండడంతో వాటి నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాగా శంషాబాద్-కొత్వాల్గూడ ప్రాంతంలో అయితే హెచ్ఎండీఏకు సంబంధించిన భూములు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ జీవో 111 పరిధిలో ఉండడంతో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్పోర్టు మెట్రో పనులు క్షేత్ర స్థాయిలో వేగంగా జరిగేలా మెట్రో అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ఉన్న 31 కి.మీ మేర నిర్మిస్తున్న మార్గంలో రూట్ సర్వే, మెట్రో స్టేషన్ల నిర్మాణంపై స్పష్టత వచ్చింది. ఇంటర్నేషనల్ టెండర్ గడువును జూలై 5 వరకు మెట్రో అధికారులు నిర్ణయించారు. ఈ లోగా పెండింగ్ పనులను పూర్తి చేసేలా కార్యాచరణను రూపొందించారు.
ప్రతిపాదిత మెట్రో స్టేషన్లు
భవిష్యత్తులో నిర్మించాలని ప్రతిపాదించిన మెట్రో స్టేషన్లు
మెట్రో డిపోల నిర్మాణానికి పరిశీలనలో ఉన్న ప్రాంతాలు