న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శనివారం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశీయ విమానాల్లో ప్రయాణీకుల సామర్థ్యాన్ని పెంచింది. ప్రస్తుతం 72.5శాతం సామర్థ్యంతో నడుస్తుండగా.. దాన్ని 85 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. ప్రయాణికుల డిమాండ్కు మేరకు షెడ్యూల్ చేసిన దేశీయ కార్యకలాపాల ప్రస్తుత స్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో దేశీయ విమానాలను పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ అనంతరం మే 25న కొవిడ్ నిబంధనల మేరకు 33 శాతం సీటింగ్ కెపాసిటీతో విమానాలు నడిపేందుకు అనుమతి ఇచ్చింది. గతేడాది డిసెంబర్ వరకు క్రమంగా 80 శాతానికి పెంచగా.. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ ఒకటిన ఆక్యుపెన్సీని 50శాతానికి తగ్గించింది. ఆగస్ట్ 12 నాటికి 72.5శాతానికి సీటింగ్ కెపాసిటీని పెంచింది.. తాజాగా 85శాతం సీటింగ్ సామర్థ్యంతో నడుపుకునేందుకు విమానయాన సంస్థలకు అనుమతి ఇచ్చింది.