Air India | బ్రిటన్లోని బర్మింగ్హమ్, లండన్, అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరాలకు విమాన సర్వీసులు పెంచాలని దేశీయ విమానయాన సంస్థ టాటా సన్స్ ఎయిర్ ఇండియా. తద్వారా అంతర్జాతీయ విమాన సర్వీసుల మార్కెట్లో తన వాటా బలోపేతం చేసుకోవాలని తలపోస్తున్నది మహారాజా. బర్మింగ్హమ్కు వారానికి ఐదు, లండన్కు తొమ్మిది, శాన్ఫ్రాన్సిస్కోకు ఆరు అదనపు విమాన సర్వీసులు నడుపుతామని ఎయిర్ ఇండియా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఫలితంగా అమెరికా, బ్రిటన్ మధ్య రాకపోకలు సాగించే వారికి అదనంగా ఐదు వేలకు పైగా సీట్లు లభిస్తాయని పేర్కొంది.
ఇప్పటివరకు బ్రిటన్కు వారానికి 34 విమానాలు మాత్రమే నడిపేది ఎయిరిండియా. ఇప్పుడవి 48 సర్వీసులకు చేరాయి. బర్మింగ్హమ్కు వెళ్లే విమాన సర్వీసుల్లో ఢిల్లీ నుంచి మూడు, అమృత్సర్ నుంచి మరో రెండు ఉంటాయి. లండన్కు వెళ్లే విమానాల్లో ఐదు ముంబై నుంచి, మూడు ఢిల్లీ నుంచి, ఒకటి అహ్మదాబాద్ నుంచి నడుపుతుంది. దేశంలోని ఏడు నగరాల నుంచి లండన్కు నాన్స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది మహారాజా.
ఇప్పటి వరకు అమెరికాకు వారానికి 34 విమాన సర్వీసులు నడుపగా.. ఇప్పుడు ఆ సంఖ్య 40కి చేరనున్నది. ముంబై- శాన్ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడు సర్వీసులతోపాటు బెంగళూరు-శాన్ ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడు సర్వసులు పునరుద్దరిస్తారు. ఢిల్లీ, ముంబై, బెంగళూర్ల నుంచి ప్రస్తుతం అమెరికాకు వారానికి 10 విమానాలు నడుపుతుండగా, ఇక నుంచి 16 సర్వీసులు నడుపుతారు. ఈ అదనపు విమాన సర్వీసులను అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య దశల వారీగా ప్రారంభిస్తారు.
పలు అంతర్జాతీయ కేంద్రాలతో భారత్లోని ప్రధాన నగరాలతో కనెక్టివిటీ పెంచడమే లక్ష్యంగా అదనపు విమాన సర్వీసులు నడుపనున్నట్లు ఎయిర్ ఇండియా సీఈవో కం ఎండీ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. వచ్చే ఐదేండ్లలో దేశీయ విమాన సర్వీసుల మార్కెట్లో 30 శాతం, అంతర్జాతీయంగా గణనీయ వాటా పొందడమే లక్ష్యంగా తమ సంస్థ పని చేస్తుందన్నారు.