ఓ అంకం ముగిసింది. ఎట్టకేలకు ఎయిర్ ఇండియాను అమ్మేయాలన్న మోదీ సర్కారు పంతం నెరవేరింది.దేశీయ విమానయాన రంగంలో ఇక ప్రభుత్వ రంగ సంస్థంటూ లేకుండా పోయింది. కేంద్ర పాలకుల నిర్లక్ష్యం, చిన్నచూపుల మధ్య ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ పూర్తయ్యింది. దాదాపు 69 ఏండ్ల తర్వాత మళ్లీ టాటాల చేతికే మహారాజ చేరుకున్నాడు. ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్నకు కేంద్ర ప్రభుత్వం అప్పగించేసింది.
న్యూఢిల్లీ, జనవరి 27: ఎయిర్ ఇండియా టాటాల సొంతమైంది. దాదాపు 69 ఏండ్ల తర్వాత మళ్లీ సొంతింటికే మహారాజ చేరుకున్నాడు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను ఇక నడపడం తమవల్ల కాదని చేతులెత్తేసిన కేంద్రం.. అమ్మేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఎట్టకేలకు పోటీ బిడ్డింగ్లో ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్ అనుబంధ సంస్థ ట్యాలెస్కు గురువారం సంస్థ యాజమాన్య హక్కులను మోదీ సర్కారు అప్పగించింది. ప్రధాని కనుసన్నల్లో ఎయిర్ ఇండియా కార్యాలయంలో ఈ తంతు ముగిసింది.
నిజానికి చమురు ధరలు, కరోనా ప్రభావం, అధిక ధర వంటివి ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణను ఇంతకాలం ఆపాయి. కాగా, 117 పెద్ద, చిన్న విమానాలు, 24 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చిన్న విమానాలు, 4,400 దేశీయ, 1,800 అంతర్జాతీయ ల్యాండింగ్ వనరులు, దేశీయ విమానాశ్రయాల్లో పార్కింగ్ స్లాట్లు ఈ డీల్లో టాటా గ్రూప్నకు దక్కుతున్నాయి. మొత్తానికి ఎయిర్ ఏషియా, విస్తారాల్లో మెజారిటీ వాటాలున్న టాటా గ్రూప్లోకి ఇప్పుడు మూడో విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా చేరింది. ఇదిలావుంటే త్వరలోనే టాటా గ్రూప్.. ఎయిర్ ఇండియా కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నది. గతేడాది అక్టోబర్లో రూ.18,000 కోట్లకు ఎయిర్ ఇండియాను టాటాలు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో రూ.2,700 కోట్ల నగదు ప్రభుత్వానికి అందింది.
మిగతా మొత్తానికి సమానమైన ఎయిర్ ఇండియా రుణ భారాన్ని మోస్తుంది. ఈ ప్రక్రియ విజయవంతంగా ముగియడానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, వివిధ శాఖలకు ఈ సందర్భంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మన్ ఎమిరేట్స్ రతన్ టాటా కృతజ్ఞతలు తెలిపారు. ఎయిర్ ఇండియాకు బంగారు భవిష్యత్తు ఉందని చంద్రశేఖరన్ అన్నారు. 1932లో అప్పటి అవిభాజ్య భారతంలో కరాచీ-బాంబే మధ్య ఎయిర్ ఇండియా (టాటా ఎయిర్లైన్స్) విమానాలు తొలిసారి నడిచాయి. 1948లో యూరప్కు ఎయిర్ ఇండియా విమానాలు మొదలయ్యాయి.
ఎయిర్ ఇండియా ప్రస్థానం
వాజపేయితో మొదలై.. మోదీతో ముగిసింది
ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ, దాని ప్రైవేటీకరణకు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే తొలి అడుగు పడింది. 2000-01లో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 40 శాతం వాటాను అమ్మాలని చూసింది. కానీ కుదర్లేదు. 2004-14 వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నా.. ఎయిర్ ఇండియా జోలికి మాత్రం వెళ్లలేదు. పైగా ఎయిర్ ఇండియా బలోపేతానికి టర్న్అరౌండ్ ప్లాన్, ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలకు ఆమోదం తెలిపింది. 2007-08లో ఇండియన్ ఎయిర్లైన్స్ను కాంగ్రెస్ సర్కారు ఎయిర్ ఇండియాలో విలీనం చేసింది. దీంతో అప్పటిదాకా లాభాల్లో ఉన్న సంస్థ.. నష్టాల్లోకి జారుకున్నది. మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం 2017 నుంచి మళ్లీ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణను ముందుకు తీసుకెళ్లింది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్టు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కలిసి ఎయిర్ ఇండియా ఉసురు తీసేశాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండున్నర దశాబ్దాలుగా నిర్వీర్యం
దేశీయ విమానయాన రంగంలో ప్రభుత్వ ప్రతిష్ఠను రెపరెపలాడించిన ఎయిర్ ఇండియా.. రెండున్నర దశాబ్దాల క్రితం నుంచే నిర్వీర్యం అవడం మొద లు పెట్టింది. 1994-95లో ప్రైవేట్ ఎయిర్లైన్స్కు తలుపులు తెరిచారు. దీంతో ధరల యుద్ధం మొదలై, ఎయిర్ ఇండియా వాటా పడిపోతూ వచ్చింది. గడిచిన ఈ రెండున్నర దశాబ్దాల్లో మూడుసార్లు ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు ప్రభుత్వాలు ప్రయత్నించాయి. కానీ ట్రేడ్ యూనియన్ల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గాయి. ప్రభుత్వ ప్రతినిధుల ప్రయాణాలు పెరిగి, వాటి బకాయిల వసూలు కోసం ఎయిర్ ఇండియా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు కేంద్రం నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందన్నది.
ఎస్బీఐ నుంచి రుణాలు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కూటమి నుంచి టాటా గ్రూప్నకు ఎయిర్ ఇండియా కార్యకలాపాల కోసం రుణాలు అందనున్నాయి. దీనివల్ల ఎయిర్ ఇండియాపై అధిక వడ్డీ రుణాల భారం తగ్గనున్నది. ఎయిర్లైన్ అవసరాలకు తగ్గట్టుగా, నిర్వహణ మూలధన రుణాలు, టర్మ్ లోన్లను మంజూరు చేస్తామని బ్యాంకర్లు తెలిపారు. వీటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి. మొత్తానికి చాలా బ్యాంకులు ఎయిర్ ఇండియా రుణాల రిఫైనాన్సింగ్కు ముందుకొచ్చాయి. ఈ ప్రక్రియలో పాల్గొనని బ్యాంకులకు ఎయిర్ ఇండియా నుంచి రావాల్సిన బకాయిల మొత్తాలు అందనున్నాయి. కాగా, ఎయిర్ ఇండియాకు పెద్ద ఎత్తున రుణాలిచ్చిన సంస్థల్లో బీమా దిగ్గజం ఎల్ఐసీ కూడా ఉన్నది. అయితే మరిన్ని రుణాలిచ్చేందుకు ఇప్పుడు సిద్ధంగా లేని ఎల్ఐసీ.. తాజా రుణాల ప్రక్రియకు దూరంగా ఉంటున్నట్టు ఓ బ్యాంకర్ తెలిపారు. గత దశాబ్దకాలంలో రూ.1.10 లక్షల కోట్లకుపైగా నిధులు ఎయిర్ ఇండియాకు వివిధ రూపాల్లో అందాయి. గతేడాది ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధిలో సంస్థ నష్టం రూ.5,422.6 కోట్లు.
ఎవరేమన్నారు?
‘ఎయిర్ ఇండియాను ఓ ప్రపంచ శ్రేణి విమానయాన సంస్థగా తీర్చిదిద్దేందుకు టాటా గ్రూప్ కట్టుబడి ఉన్నది. అంతకంటే ముందు టాటా గ్రూప్లోకి ఎయిర్ ఇండియా తిరిగి రావడం ఎంతో సంతోషకరం. మా గ్రూప్లోకి ఎయిర్ ఇండియా ఉద్యోగులందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఇక సంస్థ పురోగతి కోసం అందరం కలిసి కష్టపడుదాం’
-ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మన్
‘నూతన యాజమాన్యం నాయకత్వంలో ఎయిర్ ఇండియా అభివృద్ధిపథంలో నడుస్తుందని ఆశిస్తున్నాం. కొత్త ఎయిర్ ఇండియా.. భారత పౌర విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని భావిస్తున్నాం. టాటా గ్రూప్నకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది’ -జ్యోతిరాధిత్య సింధియా, భారత పౌర విమానయాన శాఖ మంత్రి
‘ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ గురువారం విజయవంతంగా ముగిసింది. టాటా ట్యాలెస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎయిర్ ఇండియాలోని 100 శాతం వాటాలను బదిలీ చేశాం. ఎయిర్ ఇండియా యాజమాన్య హక్కులు ఇక టాటాలవే’
-తుహిన్ కాంత పాండే, దీపం కార్యదర్శి
‘టాటా సన్స్ అనుబంధ సంస్థ ట్యాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ.2,700 కోట్లు ప్రభుత్వానికి అందాయి. గతేడాది ఆగస్టు 31 నాటికి ఎయిర్ ఇండియా రుణ భారం రూ.61,562 కోట్లు. ఇందులో 15,300 కోట్లకుపైగా బాధ్యత టాటా గ్రూప్ది. మిగతా దాదాపు రూ.46,000 కోట్లు స్పెషల్ పర్పస్ వెహికిల్, ఏఐ అసెట్ హోల్డింగ్ లిమిటెడ్కు బదిలీ అయ్యాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లతోపాటు ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటా ట్యాలెస్కు బదిలీ చేశాం’
-కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ