న్యూఢిల్లీ : పటాకులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఈ నెల 27న ‘పటాకులు కాదు.. దీపాలు వెలిగించండి’ (Patakhe Nahi Diya Jalao) కార్యక్రమానికి ప్రారంభించనున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్రాయ్ తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీ పోలీసులు, పర్యావరణ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పటాకులు పేలుస్తూ దొరికితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇప్పటికే ఢిల్లీ పరిధిలో ఎనిమిది కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.
ఈ ఏడాది బాణాసంచా విక్రయాలకు ఎలాంటి లైసెన్స్ ఇవ్వలేదని, నిషేధం ఉన్నప్పటికీ పటాకులు విక్రయాలపై సమాచారం ఉందని పేర్కొన్నారు. దీపావళి రోజున కాల్చే బాణాసంచాలు, పొలాల నుంచి వస్తున్న పొగ వృద్ధులు, పిల్లలకు ప్రాణాంతకంగా మారుతుందన్నారు. పటాకులపై అవగాహన కల్పించేందుకు బాణాసంచా కాల్చడంపై అవగాహన కల్పించడానికి ‘పటాకులు కాదు.. దీపాలు వెలిగించండి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
ఇందుకు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు విక్రయాలపై నిఘా పెట్టనున్నట్లు చెప్పారు. సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం దీపావళిని దీపాలతో జరుపుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తుందన్నారు. దీపావళి సందర్భంగా ప్రకటనలు ఇచ్చే బ్రాండ్ కంపెనీలు పండుగను ‘దీపాలతో’ జరుపుకోవాలనే సందేశాన్ని ఇవ్వాలని, విజువల్స్లో క్రాకర్స్ ఉపయోగించడం మానుకోవాలని సూచించారు.