V-Hub | బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన వినూత్న వేదిక వీ హబ్ వ్యవసాయ పనులు చేసుకునే గ్రామీణ మహిళలను ఆంత్రప్రెన్యూర్లుగా మార్చింది. కార్పొరేట్ బ్రాండ్లకు దీటుగా ‘ఆసరా’ పేరిట వారు తయారు చేస్తున్న ఉత్పత్తులు ఇప్పుడు నల్లగొండ ఉమ్మడి జిల్లాతోపాటు ఐదు రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నాయి. ఏటా రూ.50 లక్షల లావాదేవీలను నిర్వహిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు
వారంతా కూలీనాలీ చేసుకునే వ్యవసాయ కూలీలు. కానీ వారిలో సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనే పట్టుదల ఓ మహిళా సంఘంలోని మహిళలను ఏకం చేసింది. వ్యవసాయ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులను కూడబెట్టుకునే అలవాటే వారిని సరికొత్త మార్గంలో నడిచేలా చేసింది. తమ కలలను సాకారం చేసుకునేలా ఏర్పాటు చేసుకున్న లక్ష్మీ పద్మావతి మహిళా సంఘాన్ని వ్యాపార కేంద్రంగా మలిచి, వంట గదికి అవసరమైన ఆహార ఉత్పత్తులను తయారు చేయడం మొదలు పెట్టారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నెలకొల్పిన వీ హబ్ ఆ సంఘం సభ్యులకు వ్యాపార మెలకువలు నేర్పించి అండ గా నిలిచింది. మార్కెటింగ్, ఉత్పత్తుల ప్యాకేజీపై అవగాహన కల్పించి కార్పొరేట్ బ్రాండ్ తరహాలో విక్రయాలు చేసుకునేలా సాయం చేసింది. ప్రస్తుతం వీరి వ్యాపారం చుట్టుపక్కల జిల్లాలతోపాటు ఐదు రాష్ర్టాలకు ఎగుమతి చేసుకునే స్థాయికి చేరింది. ఇంటికి అవసరమైన కారం, పసుపు, మసాలా పొడులను ఉత్పత్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువు, ఎర్రగట్టు తండా, గుడిమల్కాపురం, దొండపాడు, చింతలపాలెం గ్రామాలకు చెందిన మహిళలు ఇప్పుడు వ్యాపారాన్ని విస్తరిస్తూ ఏటా రూ.50 లక్షల లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వీటిని ‘ఆసరా’ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు. ప్రతి నెలా 10 టన్నుల మేర ఆహార ఉత్పత్తులను ప్రాసెస్ చేస్తున్నట్లు ఆ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లక్ష్మమ్మ వివరించారు. మార్కెట్లో ఉండే కల్తీ, నాసిరకం ఉత్పత్తుల కంటే తమ ఉత్పత్తులు నాణ్యతతో ఉంటాయని తెలిపారు. అన్ని ఖర్చులు పోనూ ప్రతి నెలా రూ.3 నుంచి 4 లక్షల మేర సంపాదించుకునే స్థాయిలో
నిలిచారు.