లక్నో : మదర్సాలపై సర్వే కొనసాగుతుండగా యూపీ ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులపై సర్వే చేపట్టాలని నిర్ణయించింది. యోగి సర్కార్ నిర్ణయంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రజలను హిందూ-ముస్లిం అంశాలపై కేంద్రీకరించేలా చేయడంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డాయి.
పర్వత ప్రాంత భూమి, బంజరు భూమి, ఉసర్ భూమిని వక్ఫ్ ఆస్తిగా ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ చేసేందుకు వెసులుబాటు కల్పించే 1989లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను యూపీ ప్రభుత్వం మంగళవారం తిరగతోడింది. 1989, ఏప్రిల్ 7 నుంచి రిజిస్టరైన అన్ని ఆస్తుల పత్రాలను పునఃపరిశీలించాలని జిల్లా మేజిస్ట్రేట్లు, కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పాత ఉత్తర్వుల పేరుతో సాగు భూములను కూడా వక్ఫ్ ఆస్తులుగా రెవెన్యూ రికార్డుల్లో ప్రకటించారని ప్రభుత్వం భావిస్తోంది.
ముస్లిం వక్ఫ్ చట్టం 1960 ప్రకారం ఏ వక్ఫ్ ఆస్తిని కూడా ఆటోమేటిక్గా రిజిస్టర్ చేయరాదని స్పష్టం చేసింది. కాగా వక్ఫ్ ఆస్తుల సర్వే నిర్ణయం పట్ల ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల సర్వే నిర్ణయానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. మదర్సాలను సర్వే చేసే పాలకులు భారత్ను ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధగా తయారుచేస్తారా అని అఖిలేష్ ఎద్దేవా చేశారు.