TG Assembly | తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ.. సంక్షేమం, సామాజిక న్యాయానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అభివృద్ధి, ప్రగతి వైపు అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతులకు రూ.25వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు.వరి రైతులకు పంట బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇది తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.
అయితే గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగంలో అన్ని అబద్ధాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రుణమాఫీ, రైతు భరోసా, వరికి రూ.500 బోనస్ ఇవ్వలేదని నినాదాలు చేశారు. సంపూర్ణ రుణమాఫీ చేయాలని, పంట బోనస్ ఇవ్వాలని పట్టుబట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన మధ్యే గవర్నర్ ప్రసంగం ముగిసింది. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం సమావేశాలను వాయిదా వేశారు. కాసేపట్లో బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలను ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.