దుబాయ్: పాకిస్థాన్ స్పీడ్స్టర్ షాహీన్ అఫ్రిదికి జరిమానా పడింది. రెండో టీ20 సందర్భంగా బంగ్లా ఆటగాడు ఆఫిఫ్ హుసేన్ మీదకు బంతి విసిరిన అఫ్రిదిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా మందలించింది. కాగా.. శనివారం రెండో టీ20 సందర్భంగా అఫిఫ్ కొట్టిన బంతిని అందుకున్న అఫ్రిది.. గురిచూసి వికెట్లకు కొట్టాడు. ఆ సమయంలో అఫిఫ్ క్రీజులోనే ఉన్నా.. అంతకుముందు బంతికి భారీ షాట్ కొట్టాడనే ఆగ్రహంతో అఫ్రిది బంతిని బలంగా అతడిపైకి విసిరాడు. అనూహ్య చర్యతో అఫిఫ్ ఒక్కసారిగా క్రీజులోనే పడిపోగా.. వైద్యబృందం మైదానంలోకి వచ్చి అతడిని పరిశీలించింది. మ్యాచ్ అనంతరం బంగ్లా బ్యాటర్కు అఫ్రిది క్షమాపణలు చెప్పాడు.