ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 2: జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సామాన్యులకు కామన్ సర్వీస్ సెంటర్లు సేవలందిస్తున్నాయి. దీంతో పాటు ఒక అడుగు ముందుకేసి సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఉత్తమ సేవలతో గుర్తింపు పొందుతున్నాయి. 75వ ఆజాదీకా అమృత్ మహోత్సవాల సందర్భంగా రాష్ట్రం మొత్తంమీద 25 మంది సీఎస్సీ వీఎల్ఈలను అవార్డులు వరించగా, అందులో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. ఇచ్చోడకు చెందిన సీఎస్సీ కొండ ప్రశాంత్( సోషల్ సెక్యూరిటీ స్కీం విభాగం), ఆదిలాబాద్కు చెందిన పవార్ అంబాజీ (ఎస్బీఐ బీసీ పాయింట్లలో ఎక్కువ లావాదేవీలు చేసినందుకు), ఉట్నూరుకు చెందిన జాదవ్ రాంప్రసాద్ (టెలీ లా సర్వీస్లో ఎక్కువ కేసులు రిజిస్ట్రేషన్ చేసినందుకు) అవార్డులు పొందారు. హైదరాబాద్లోని బీపీఆర్ విఠల్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ఈ అవార్డులు ప్రదానం చేశారు. సీఎస్సీ రాష్ట్ర సీవో రాజకిషోర్ చేతులమీదుగా షీల్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
వివిధ సేవలందిస్తూ..
ప్రస్తుతం సీఎస్సీలో కూలీల కోసం కొత్తగా ఈ శ్రమ్ కార్డులను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఉచిత న్యాయ సహాయం, కిసాన్ ఈ స్టోర్ వెబ్సైట్ ద్వారా విత్తనాలు,ఎరువుల కొనుగోలు, పాన్కార్డు, మినీ గ్యాస్, ఆన్లైన్ చెల్లింపులు, వివిధ రకాల బీమా సేవలు అందిస్తున్నారు. సామాన్యుల వ్యయప్రయాసలు తగ్గించడానికి సీఎస్సీలు ఉచిత సేవలు అందిస్తున్నాయి. పీఎంఈజీ కింద విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్కు చెందిన ఆర్తి అనే అభాగ్యురాలు పక్షవాతంతో రిమ్స్లో చికిత్స పొందుతుండగా, ఆమెకు బ్యాంకు ఖాతాను వైద్యశాలకే వెళ్లి అందజేశారు. కొవిడ్ సమయంలో సీఎస్సీ జిల్లా మేనేజర్ రాహుల్ ఆధ్వర్యంలో పేదలకు సరకుల పంపిణీ చేపట్టారు.అలాగే గిరిజన గ్రామాలకే వెళ్లి పలు చెల్లింపులు చేశారు. సిగ్నళ్లు రాని ప్రాంతాలకు కూడా కాలినడకన వెళ్లి చెల్లింపులు చేస్తున్నారు.
సమన్వయంతో సమర్థవంత సేవలు..
కొవిడ్ సమయంలోనూ బాధ్యతగా విధులు నిర్వర్తించాం. డిజిటల్ సేవల పరంగా సీఎస్సీ వీఎల్ఈలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, తాజా పథకాలను వివరిస్తూ సామాన్యుడికి ఉత్తమ సేవలందేలా చూశాం. ఈ సేవలకు గుర్తింపుగా మూడు సీఎస్సీలకు అవార్డులు రావడంతో మా బాధ్యత మరింతగా పెరిగింది.
ఉపాధి పొందుతూ సేవలందిస్తున్న..
నేను ఏంబీఎ తర్వాత సీఎస్స్సీలో శిక్షణ పొంది ఏడేళ్లుగా ఎస్బీఐ బీసీ పాయింట్ నిర్వహిస్తున్న. సామాన్యులకు నిరంతరంగా నగదు లావాదేవీలు ఆన్లైన్ ద్వారా ఫీజులు లేకుండా అందిస్తున్న. అత్యధికంగా లావాదేవీలు చేయడంతో ఈ అవార్డు వచ్చింది. సీఎస్సీ జిల్లా మేనేజర్ రాహుల్ సహకారం ఎంతో ఉంది.