మహిమాన్విత యాదాద్రి కొండపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. యాదాద్రి బాలాలయంలో లక్ష్మీనరసింహుడి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు ఆదివారం నిత్యపూజ కైంకర్యాల అనంతరం మూలమంత్ర, మూర్తి మంత్ర హోమాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని అభిషేకించి మత్స్యావతారుడిగా అలంకరించి ఆస్థానం చేశారు. నాలుగు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, దివ్యప్రబంధ ప్రాశుర పఠనాలను కనుల పండువగా చేపట్టారు. దుష్ట శిక్షణ..
శిష్ట రక్షణ కోసం మహా విష్ణువు అవతార రూపాల్లో స్వామివారిని ఉత్సవాల్లో అలంకరించి సేవించడం ప్రత్యేకత అంటూ
ప్రధానార్చకులు మత్స్యావతార విశిష్టతను వివరించారు. పట్టు వస్ర్తాలు, బంగారు, వజ్రా భరణాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్య మంగళకరంగా అలంకరించిన స్వామి వారిని కొలుస్తూ మంత్రోచ్ఛరణలు, మూలమంత్ర జప స్తోత్రాలు సాగుతుండగా గోవిందనామ స్మరణ మార్మోగింది.
యాదాద్రి, మార్చి 6
‘భగవానుడు సర్వభూత హితుడు, సర్వభూతమయుడు, సర్వాంతర్యామి. భూమిపై అవతరించి లోకోద్ధరణ గావించిన అవతారంలో మత్స్యావతారం ఒకటి అని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు వివరించారు. ఈ సందర్భంగా మత్స్యావతార విశిష్టతకు భక్తులకు ఇలా వినిపించారు. ‘పూర్వం ఒక కల్పాంత సమయంలో బ్రహ్మదేవుడు నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో ప్రళయం సంభవించి లోకం పూర్తిగా నీటిలో మునిగింది. అప్పుడు బ్రహ్మ ముఖం నుంచి వేదములు వెలువడ్డాయి.. ఆ వేదములను సోమకాసురుడు అనే రాక్షసుడు అపహరిస్తాడు. శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించి రాక్షసుడిని సంహరించి వేదమలను రక్షించి బ్రహ్మవశం చేశాడని భాగవతోక్తి. చేపకు ప్రధాన అవయవం దాని విశాల నేత్రం. ఏ విషయాన్నైనా సమగ్రమైన కుశాగ్ర దృష్టితో లోతుగా పరీక్షించి గ్రాహ్యం చేసుకొమ్మని చేప కన్ను సూచిస్తుంది’ అని వివరించారు. మత్స్సావతార అలంకారం దర్శించుకున్న వారికి అజ్ఞానశక్తుల నశించి, జ్ఞాన శక్తులు కలిగి, శరీరం, ఆత్మ, పరమాత్మ అనే వివేక జ్ఞానం కలుగుతుందని వేదాలు చెబుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో లక్ష్మీనారసింహుడు వివిధ వాహనసేవల్లో భక్తులకు దర్శనమివ్వడం సంప్రదాయం అని తెలిపారు.
వాహనం అనగా మోయునది అని అర్థం. భగవంతుడిని భక్తుల వద్దకు చేర్చు పరమ భాగవతోత్తములను వాహనాలుగా స్వీకరించి భగవానుడు భక్త కోటికి దర్శన భాగ్యం కలిగించుచున్నాడని, బ్రహ్మోత్సవాల్లో ప్రప్రథమంగా శేషవానారూఢుడై భగవానుడు భక్తులకు దర్శనం కలిగిస్తాడని అర్చకులు తెలిపారు. శేష శయ్యపై వేంచేసిన దర్శనం సర్వాభీష్ట ప్రదాయకం అని ఆళ్వారాదులు ప్రస్తుతించారన్నారు. సర్వేశ్వరుడికి గొడుగుగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా త్రివిధ కైంకర్యాలను ఏకకాలంలో నిర్వహించిన మహానుభావుడు ఆదిశేషుడు అని వివరించారు. సకల దేవతలు శ్రీహరి పాద పద్మములకు సమస్కరించేటప్పుడు పాదపీఠంగా ఉన్న ఆదిశేషునికి శ్రీమహావిష్ణువు ప్రథమ నమస్కార అర్హతను అప్రయత్నంగా అనుగ్రహించడం అవ్యాజ కృప అని పేర్కొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామి వారు వటపత్రశాయి అవతారంలో భక్తులకు దర్శనమిస్తాడు. వాహనం, వేద పారాయణం నిర్వహిస్తారు. రాత్రి హంస వాహనంపై స్వామివారి సేవ జరుగుతుంది.
స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారికి జోడు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. నిత్యహోమం, చతుస్థానార్చనల అనంతరం లక్ష్మీనరసింహుడు శేషవాహన సేవలు అందుకున్నారు. శ్రీవైకుంఠంలో స్వామివారికి నిరంతరం సేవా కైంకర్యాలు చేసే సేవకుడు అనంతుడు.. అతడే ఆదిశేషు. అలాంటి ఆదిశేషుడిలో స్వామివారిని అలంకరించి ఆస్థానం చేశారు. వేదాలు, పురాణాలతో ప్రార్థించారు. భక్త జన బాంధవుడు లక్ష్మీనరసింహుడు ప్రీతిపాత్రమైన శేష వాహనుడిపై బాలాలయం మండపంలో ఊరేగారు. సహస్ర ఫణితో గల శేష వాహనుడు లక్ష్మీసమేత నరసింహస్వామిని అధిరోహించుకుని భక్తజనులకు దర్శనమిస్తూ మంగళాశాసనాలు అందించారు. బ్రహ్మోత్సవ శుభ రాత్రుల్లో యాదాద్రి కొండపై జ్వాలాకృతిలో, సర్పాకారంలో వెలిసిన స్వామివారిని శ్రీదేవీ భూదేవీ సమేతంగా ఆది శేష వాహనాన్ని భక్తులు కనులారా దర్శించుకున్నారు.
కార్యక్రమంలో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, యాజ్ఞీకులు శ్రీమాన్ ఉభయ వేదాంత శేషం ప్రణీతాచార్యులు, ఉప ప్రధానార్చకులు సరేంద్రాచార్యులు, రంగాచార్యులు, వెంకటాచార్యులు, శ్రీధరాచార్యులు, ఏఈఓలు గజవెల్లి రమేశ్బాబు, గట్టు శ్రవణ్కుమార్ పాల్గొన్నారు.
మత్స్యావతారంలో దర్శనమిచ్చిన నరసింహుడి చేతిలో వేద గ్రంథాలు భక్తులను ఎంతగానో అలరించాయి. నాలుగు చేతుల్లో నాలుగు గ్రంథాలు ఉంచి స్వామివారిని అద్భుతంగా తీర్చిదిద్దారు. అధర్వణ వేదం, ఋగ్వేదం, సామవేదం, యుజుర్వేద గ్రంథాలతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించాడని, అందుకే స్వామివారి చేతిలో వేదాలను ఉంచినట్లు ఆలయ ప్రధానార్చకుడు తెలిపారు.