ఖమ్మం సిటీ, అక్టోబర్ 22: ఖమ్మం అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి ప్రభుత్వ దవాఖానలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. జిల్లా స్థాయి అధికారి అయినప్పటికీ కూడా ఆమె తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న మెరుగైన వైద్య వసతులపై పూర్తి విశ్వాసంతో శుక్రవారం ఖమ్మంలోని జిల్లా కేంద్ర దవాఖానలో చేరారు. పురిటి నొప్పులతో సామాన్య మహిళ మాదిరిగా వచ్చిన అదనపు కలెక్టర్కు అన్నిరకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం జరిపించగా.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బీ మాలతి, ప్రభుత్వ దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బీ శ్రీనివాసరావు వైద్య సేవలను పర్యవేక్షించారు. అదనపు కలెక్టర్ హోదాలో ఉన్నప్పటికీ సర్కా రు దవాఖానలో డెలివరీ చేయించుకొని ప్రజలకు ఆదర్శంగా నిలిచారం టూ ప్రతిఒక్కరూ కొనియాడుతున్నా రు. ‘సెల్యూట్ స్నేహలత’ అంటూ నెటిజన్లు సైతం కీర్తిస్తున్నారు.