యాదాద్రి, జనవరి 23: ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తి కాదు.. ఒక శక్తి అని సినీనటుడు సుమన్ కితాబిచ్చారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ.. యాదాద్రిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన రాలేదని, అది కేవలం కేసీఆర్కే రావడం దేవుడిచ్చిన వరమన్నారు. యాదాద్రి ఆలయాన్ని దేశంలో ఓ గొప్ప స్థాయికి తీసుకొచ్చారని అభిప్రాయపడ్డారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. ఎంత ఖర్చయినా పర్వాలేదని యాదాద్రి ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దారని సుమన్ కొనియాడారు. స్వరాష్ట్రంలో అభివృద్ధి అద్భుతంగా సాగుతున్నదని చెప్పారు. రాబోయే రోజుల్లో యాదాద్రి పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్లు జరుగుతాయని పేర్కొన్నారు.