ఆదాయ పన్ను (ఐటీ) శాఖకు వార్షిక రిటర్న్స్ సమర్పించే సమయం వచ్చేసింది.
గత ఏడాది సంపాదించిన మొత్తం ఎంత?.. దానిపై చెల్లించాల్సిన పన్ను ఎంత?.. పొందిన మినహాయింపులు ఏమిటి?.. అనే తర్జనభర్జనలు ఈ పాటికే మనలో చాలామందికి మొదలైపోయి ఉంటాయి.
ఇంకొంత మంది చార్టెడ్ అకౌంటెంట్ల దగ్గరికి క్యూ కడుతూంటారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆఖరి గడువులోపు మనం రిటర్న్స్ సమర్పించకపోతే కొన్ని సందర్భాల్లో లేట్ ఫైలింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అంతా ఇక తొందరపడాల్సిన సమయమిది.
ఐటీ చట్టం 1961, సెక్షన్ 234ఏ ప్రకారం గడువు ముగిసిన తర్వాత ఐటీ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేసేవాళ్లు వడ్డీ, జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే ఇది అందరికీ వర్తించబోదు. వ్యక్తుల దగ్గర్నుంచి కార్పొరేట్ కంపెనీలదాకా వివిధ నిబంధనలు, తేదీలున్నాయి. ఈ నెల 31లోగా వ్యక్తిగత, హిందూ అవిభాజ్య కుటుంబాలు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, వ్యక్తిగత సంఘాలు తత్సంబంధ సంవత్సరానికి రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
అకౌంట్స్ను ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం లేనివాళ్లకే ఇది వర్తిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించకపోతే తప్ప మనలో చాలామంది ఈ నెలాఖర్లోగా రిటర్న్స్ సమర్పించాల్సిందే. ఇక అక్టోబర్ 31లోగా కంపెనీలు, వ్యక్తిగత సంస్థలు (పార్ట్నర్షిప్, ప్రొప్రైటర్షిప్, వర్కింగ్ పార్ట్నర్ ఫర్మ్స్) రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే విదేశాల్లో లావాదేవీలు నిర్వహించినవాళ్లు ప్రత్యేకంగా సెక్షన్ 92ఈ నిబంధన ప్రకారం రిపోర్ట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అలాంటివాళ్లకు మాత్రమే నవంబర్ 30 వరకూ రిటర్న్స్ వేసేందుకు గడువు ఉంటుంది.
అవకాశం దొరికింది కదా అని ఎప్పుడుపడితే అప్పుడు మనం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి వీల్లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ మాత్రమే డిసెంబర్ 31లోగా దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఐటీ రిటర్న్స్ అందరూ తప్పక ఫైల్ చేయాల్సిన అవసరం ఏమీలేదు. కానీ దేనికైనా ఓ నిర్దిష్ట సమయంలో చేసే దానికే విలువ ఉంటుందనే సంగతి గుర్తుంచుకోవాలి. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సామాన్యులు (ఇండివిడ్యుయల్స్) ఏడాదిలో ఎప్పుడైనా రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చు. దాన్ని బిలేటెడ్ ఐటీఆర్ కింద పరిగణిస్తారు. గడువు దాటిన తర్వాత ఫైల్ చేసే వాటిల్లో మార్పులు, చేర్పులకు అవకాశాలు తగ్గిపోవడంతోపాటు అనవసరంగా లేట్ ఫైలింగ్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది. ఇండివిడ్యువల్స్ సెక్షన్ 234ఎఫ్ ప్రకారం రూ.5,000 జరిమానా చెల్లించాలి. అయితే రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు డెడ్లైన్ తర్వాత రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.1,000 పెనాల్టీ కట్టాలి. దీంతోపాటు మనపై ఏదైనా పన్ను బకాయిలుంటే.. సరైన సమయంలో వాటిని కట్టనందుకూ ఆ పెనాల్టీపై వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుంది.
-నాగేంద్ర సాయి కుందవరంరిటర్నులకు వేళాయెరా..
చాలామందికి ఇప్పటికీ ఫైనాన్షియల్ ఇయర్ (ఆర్థిక సంవత్సరం), అసెస్మెంట్ ఇయర్ (మదింపు సంవత్సరం) అనేవి అయోమయ విషయాలు. ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనం ఆదాయాన్ని పొందిన సంవత్సరం. అసెస్మెంట్ ఇయర్ అంటే ఆ ఆదాయాన్ని లెక్కించి కట్టే సంవత్సరం. ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్కు మనం ఈ ఏడాది అసెస్మెంట్లో పన్ను చెల్లిస్తాం. అలాగే రిటర్న్స్ సమర్పిస్తాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫైనాన్షియల్ ఇయర్ 2021-22కుగాను రిటర్న్స్ను అసెస్మెంట్ ఇయర్ 2022-23లో దాఖలు చేస్తున్నాం.
ఐటీ శాఖ నిబంధనల ప్రకారం కొంతమంది వ్యక్తులకు ఈ లేట్ పేమెంట్ ఫీజు నుంచి మినహాయింపు ఉన్నది. వాళ్లు బిలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేసినా ఇబ్బందేమీ లేదు. కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన కనీస మినహాయింపు పరిమితి కంటే తక్కువ ఆదాయాన్ని పొందుతున్నవారే ఇందుకు అర్హులు. ఈ పరిమితి అందరికీ రూ.2.5 లక్షలుగా ఉన్నది. సీనియర్ సిటిజన్లకు మాత్రం రూ.3 లక్షలుగా ఉంది.