ఆదిలాబాద్ టౌన్, మార్చి 11 : ఆదిలాబాద్లో సీసీఐ పునరుద్ధరణ కోసం తోడూనీడగా ఉంటానని పార్లమెంటరీ పరిశ్రమల స్టాండింగ్ కమిటీ చైర్మన్ కే కేశవరావు హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎంపీ నగేశ్, సీసీఐ సాధన కమిటీ సభ్యులు శుక్రవారం హైదరాబాద్లో శుక్రవారం ఆయనను కలిశారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. సీసీఐ గురించి సమగ్రంగా చర్చించారు. సీసీఐ సాధనే లక్ష్యంగా త్వరలో హైదరాబాద్లోనే స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామని, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్, మాజీ ఎంపీ, భూ నిర్వాసితులు, వివిధ పార్టీల నాయకులు, సీసీఐ సాధన కమిటీని ఆహ్వానిస్తామని కేశవరావు స్పష్టం చేసినట్లు నాయకులు తెలిపారు. అనంతరం వారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ నాయకులు సానంపల్లి మల్లారెడ్డి, నాగన్న, రవికుమార్ను కలిశారు. వివిధ పార్టీల పెద్దలు సీసీఐ కోసం మద్దతు ఇవ్వడంపై ఎమ్మెల్యే, సాధన కమిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. వారిని కలిసిన వారిలో నాయకులు బండి దత్తాత్రి, నారాయణ, నర్సింగ్, జీ నరేందర్ యాదవ్, మేకల నాగయ్య, కృష్ణ తదితరులు ఉన్నారు.