హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): చలికాలంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)-2020 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2020లో 3,54,796 రోడ్డు ప్రమాదాలు జరిగితే, వీటిలో అక్టోబర్ నుంచి జనవరి మధ్యే అత్యధిక ప్రమాదాలు నమోదైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. చలికాలంలో పొగమంచు, పగటి సమయం తక్కువగా ఉండటం.. చీకటి ప్రయాణాల కారణంగా వీటి సంఖ్య ఎక్కువగా ఉంటున్నట్టు తెలిపింది. రోడ్డు ప్రమాద మృతుల్లోనూ ద్విచక్రవాహనదారులే ఎక్కువగా ఉంటున్నట్టు లెక్కలు వివరిస్తున్నాయి. రోడ్డు ప్రమాద మృతుల్లో పాదచారులు సైతం 8.9 శాతం మంది ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా 2020లో రోడ్డు ప్రమాదాలు తగ్గినట్టు ఎన్సీఆర్బీ వెల్లడించింది. రోడ్డు ప్రమాదాల కారణంగా 2019లో 4,21,104 మంది మృతిచెందగా, 2020లో ఆ సంఖ్య 3,74,397కు తగ్గినట్టు పేర్కొన్నది. మృతుల్లో అత్యధిక శాతం (30.1%) మంది 30 నుంచి 45 ఏండ్లవారు ఉండగా, ఆ తర్వాతి స్థానంలో 18 నుంచి 30 ఏండ్లలోపువారు 25.8 శాతం మంది ఉన్నట్టు వెల్లడించింది. తెలంగాణలో 2020లో 11,822 మంది ప్రణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో 14,653 మంది మృతిచెందారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 57,806 మంది, మధ్యప్రదేశ్లో 40,518 మంది మృత్యువాత పడ్డారు.