హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఉద్యోగార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెండు వారాలలో గ్రూప్-1 స్టడీ మెటీరియల్ను అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకున్నట్టు అకాడమీ డైరెక్టర్ దేవసేన తెలిపారు. రాష్ట్రంలో ఒకేసారి అనేక ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ కొనసాగుతుండటంతో పోటీ పరీక్షలకు కావాల్సిన స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తీసుకురావడం కొంత ఆలస్యమవుతున్నదని వెల్లడించారు.
పేపర్ ధరలు గత ఏడాదితో పోల్చితే దాదాపు 50 శాతం పైగా పెరిగాయి. దీంతో స్టడీ మెటీరియల్కు కావాల్సిన పేపర్ కొనుగోలు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనట్టు తెలిపారు. పేపర్ ధరలు పెరుగడం వల్ల అకాడమీపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ అందరికీ అందుబాటులో ఉండే ధరలతో స్టడీ మెటీరియల్ను అందిస్తామని అకాడమి అధికారులు చెబుతున్నారు.
గ్రూప్-1కు కావాల్సిన తెలంగాణ చరిత్ర, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఉద్యమంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి గ్రూప్-1 సిలబస్లో పొందుపరిచిన అంశాల వారీగా పుస్తకాలను ముద్రించేందుకు తెలుగు అకాడమీ కసరత్తు చేస్తున్నది. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్తో పాటుగా గ్రూప్-1 మొదలు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు తయారు చేసి దశలవారీగా మార్కెట్లోకి విడుదల చేయడానికి కృషి చేస్తున్నారు. తెలుగు మీడియంలోనే కాకుండా ఇంగ్లిష్ మీడియంలో కూడా పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.