ప్రముఖ సాహితీవేత్త వానమామలై వరదాచార్యులు వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం మడికొండ గ్రామంలో 1912, ఆగస్టు 16న జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన వరదాచార్యులు ఏడో తరగతి వరకే చదువుకున్నారు. అయినా సంస్కృతాంధ్ర సాహిత్యం, తార్కికం, వేదాంతం, వ్యాకరణాలను అభ్యసించారు. సంస్కృతం, తెలుగు, ఉర్దూ, హిందీ, ద్రవిడం, మరాఠీ, ఇంగ్లిషు భాషల్లో పట్టు సాధించారు. హరికథాగానంలో కూడా ప్రావీణ్యాన్ని సంపాదించారు. ‘పోతన చరిత్ర’ను రచించి అభినవ పోతనగా వానమామలై గుర్తింపు పొందారు.
వరదాచార్యుల సహజ పాండిత్యాన్ని గుర్తించిన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వు ల ద్వారా నిజామాబాద్ జిల్లా దోమకొం డ జనతా కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకుడిగా నియమించారు. అనంతరం ఆయన ఆంధ్ర సారస్వత పరిషత్తు నుంచి ‘విశారద’ పట్టా పొందారు. పదమూడేండ్లు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1972లో ఉద్యోగ విరమణ పొందారు. 1972లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీవీ ద్వారా శాసనమండలికి నామినేట్ అయ్యారు. 1950లలో వానమామలై క్షయవ్యాధికి గురై ఊపిరితిత్తులకు పలుసార్లు శస్త్రచికిత్స చేయించకున్నారు. అయినా, ఒక ఊపిరితిత్తి తీసివేయాల్సి వచ్చింది. సుదీర్ఘ కాలం ఒక ఊపిరితిత్తి తోనే ఉండి 1984, అక్టోబర్ 31న వానమామలై మరణించారు.
చిన్న వయసులోనే రచనలు ప్రారంభించిన వానమామలై మొత్తం 60కి పైగా గ్రంథాలు రచించారు. వాటిలో ‘పోతన చరిత్రము’, ‘వైశాలిని’, ‘జయధ్వజము’, ‘దాగుడుమూతలు’, ‘మాతృప్రేమ’, ‘రైతుబిడ్డ’ ముఖ్యమైనవి.
1968లో ‘పోతన చరిత్రము’ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం, 1973లో కరీంనగర్ జిల్లా కోరుట్లలో భారతీ సాహిత్య సమితి వారి ద్వారా స్వర్ణ కంకణం, రత్నాభిషేకం జరిగాయి. 1976లో సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, వారణాసి వారి ద్వారా ‘డి.లిట్’ గౌరవ పట్టా లభించింది.
వరదాచార్యులు జన్మించింది మడికొండలోనే అయినా వివాహానంతరం వారి నివాసం మంచిర్యాల జిల్లాలోని చెన్నూరుకు మారింది. ఆయనకు 8వ ఏట ఉపనయన సంస్కారంతో పాటు శ్రీరామ తారక మంత్రోపదేశం జరిగింది. బాల్య గురువైన కాళోజీ రంగారావు శ్రీరామ తారకమంత్రం ఉపదేశించగా, మంథనివాసి, మేనమామ తిరువంగం గోపాలాచార్యులు వరదాచార్యులకు 13వ యేట వాగీశ్వరీ మహామంత్రోపదేశం చేశారు.
వరదాచార్యులు చెన్నూరులోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నారు. 1944లో ‘పోతన చరిత్ర’తో రచన ప్రారంభించిన వరదాచార్యులు నాటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యానికి గురయ్యా రు. తగిన వైద్యం పొందలేకపోయిన వరదాచార్యులను పీవీ ఆదుకున్నారు. బహుభాషా కోవిదులైన వరదాచార్యులను నాటి తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘అభినవ పోతన’ బిరుదు ఇచ్చి ఘనంగా సన్మానించారు.
విద్యార్హతలు లేని వరదాచార్యులు కుటుంబ పోషణ నిమిత్తం స్వీయరచన అయిన ‘మణిమాల’యే పాఠ్యాంశంగా పరీక్షలు రాశారు. ఆంధ్రా సారస్వతులుగా ఉత్తీర్ణులు కావడంతో ఉద్యోగానికి అర్హత లభించింది. బదిలీలో భాగంగా 1961 లో చెన్నూరులో పాదం మోపి పదేండ్ల పాటు అక్కడే ఉన్నారు. వృత్తి ఉపాధ్యాయునిగా, ప్రవృ త్తి రచయితగా కొనసాగుతూ రచనాసేద్యం చేసిన వరదా చార్యులు రచయితలకు ఆదర్శప్రాయులు.
కొమ్మెర రామమూర్తి
99081 46470
(నేడు వానమామలై వర్ధంతి)