బంజారాహిల్స్,ఏప్రిల్ 29 : డ్రంక్ అండ్ డ్రైవ్లో(Drunk and driving) పట్టుబడిన మహిళను(Woman) తప్పించేందుకు వాహనాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఇతర వాహనాలను ఢీకొట్టి పారిపోయిన(Escaped) వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని స్టడీ సర్కిల్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అదే సమయంలో అక్కడకు వచ్చిన మహేంద్ర థార్ (టీఎస్08జేజెడ్4566)ను ఆపారు. కారు నడిపిస్తున్న మహిళకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. దీంతో కారును పక్కకు పార్క్ చేయాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కాగా పక్కసీటులో కూర్చున్న వ్యక్తి తాను కారును పక్కకు తీస్తానంటూ డ్రైవింగ్ సీట్లోకి వచ్చాడు. కారును వేగంగా వెనక్కి తీస్తూ బైక్ను ఢీకొట్టాడు.
దాంతో ట్రాఫిక్ పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా వేగంగా ముందుకు దూకిస్తూ బారికేడ్లను ఢీకొట్టడంతో పాటు అడ్డుగా వచ్చిన ట్రాఫిక్ హోంగార్డు దుర్గారావును ఢీకొట్టడంతో పాటు అక్కడినుంచి కారుతో సహా పారిపోయాడు. ఈ మేరకు హోంగార్డు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదుతో కారు నడిపిన వ్యక్తిపై ఐపీసీ 332,353,279 రెడ్విత్ 34తో పాటు 184 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కారు బందుగల శివాలీరెడ్డి పేరుతో రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు.