Adilabad | పెళ్లయిన నాలుగు నెలలకే ఓ భర్త తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానమే ఆమె ప్రాణాలను బలిగొన్నది. భార్యను చంపిన అనంతరం పారిపోయేందుకు యత్నించిన భర్త రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ పట్టణంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ పట్టణంలోని బంగారిగూడకు చెందిన మోహితె జైవంత్, పద్మ దంపతుల కుమారుడు అరుణ్ మేస్త్రీ పని చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన దీప అనే యువతితో అరుణ్కు ఈ ఏడాది మే 5వ తేదీన వివాహమైంది. పెళ్లైన కొద్ది రోజులకే అరుణ్ తన భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు. తరుచూ గొడవపడేవారు. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి.
నాగులపంచమికి పుట్టింటికి వెళ్లిన దీపను.. ఆగస్టు 29న అల్లుడు అరుణ్తో మెట్టినింటికి పంపారు ఆమె తల్లిదండ్రులు. ఇక అరుణ్ దీపతో గురువారం రాత్రి గొడవపడ్డాడు. శుక్రవారం తెల్లవారుజామున దీపను మంచానికి కట్టేసి గొంతు నులిమి చంపాడు. అనంతరం అరుణ్ తన బైక్పై పారిపోయాడు. దీప విగతజీవిగా కనిపించడంతో.. ఆమె అత్తమామలు షాక్కు గురయ్యారు. అరుణ్కు ఫోన్ చేయగా, తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. ఇదే సమయంలో మమతా జిన్నింగ్ సమీపంలో అరుణ్ తన బైక్ను లారీకి వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భర్త, అత్తమామలే తమ కూతురిని బలిగొన్నారని దీప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.