మంచిర్యాల/పెద్దపల్లి, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ): కోల్బెల్ట్ ఏరియాల్లో శనివారం మధ్యాహ్నం స్వల్పంగా భూమి కంపించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్, సున్నంబట్టి వాడతోపాటు కోల్బెల్ట్ ప్రాంతాలైన శ్రీరాంపూర్, నస్పూర్లోని నాగార్జున కాలనీ, సీసీసీ, షిర్కేలో మధ్యాహ్నం 2.03 గంటలకు 2 సెకండ్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇండ్లలో నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. కలెక్టరేట్ సిబ్బంది ఒక్కసారిగా బయటకు వచ్చారు. సున్నంబట్టి వాడలోని పలు ఇండ్లల్లో కిటికీల అద్దాలకు పగుళ్లు ఏర్పడగా, పలుచోట్ల పెచ్చులు ఊడి పడ్డాయి. కాగా పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్కాపూర్, నర్రశాలపల్లి ప్రాంతంలోనూ భూమి రెండు సెకండ్లపాటు కంపించింది. రిక్టర్ స్కేల్పై ఈ భూప్రకంపనల తీవ్రత 4.0 నమోదైంది. భూ ఉపరితలం నుంచి 20 కిలోమీటర్ల లోతు వరకు భూ ప్రకంపన జరిగినట్టు అధికారులు తెలిపారు.