జయశంకర్భూపాలపల్లి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : సింగరేణి కంపెనీలో పరికరాల కొరత కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. గని లోపల పనిచేసే స్థలాల్లో కీలకమైన యంత్రాలు, పరికరాలు అందుబాటులో లేకపోవడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతున్నది. నాసిరకం పరికరాలు అందించడం వల్ల యంత్రాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. గనుల్లో పని చేసే కోల్ కట్టర్లు, సపోర్ట్ మెన్లు, లైన్మెన్లు, టింబర్ మెన్లకు పనిస్థలాల్లో అవసరమైన డ్రిల్రాడ్లు, డ్రిల్ బిట్లు, పైకప్పు సపోర్టులు, ఇతర విడిభాగాలు సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో పాత వాటినే మరమ్మతులు చేసి వినియోగించాల్సి వస్తున్నదని కార్మికులు పేర్కొంటున్నారు.
కమీషన్లకు ఆశపడి క్వాలిటీలేని పరికరాలు అందజేస్తున్నారని బాధపడుతున్నారు. భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అవసరమైన డ్రిల్రాడ్లు, డ్రిల్బిట్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం అరిగిపోయిన డ్రిల్రాడ్లకు మరో భాగాన్ని జతచేసి ఉపయోగిస్తున్నారు. ఒక డ్రిల్యంత్రంతో సగటున 50 రంధ్రాలు వేయగలిగే పరిస్థితి ఉండగా, పాతరాడ్లు, పాతబిట్లతో పని చేయడం వల్ల కార్మికులపై పనిభారం తీవ్రంగా పెరుగుతున్నది. దీంతో కోల్కట్టర్లు, సార్ట్మెన్స్, టింబర్మెన్లు నానా అవస్థలు పడుతున్నారు. భూగర్భ గనుల్లో పైకప్పు కూలిపోకుండా రక్షణగా ఉపయోగించే కర్ర దిమ్మలు, ఇనుప స్రాప్స్ కూడా అందుబాటులో లేవు. జూన్లో ఇవ్వాల్సిన బూట్లు, హ్యాండ్గ్లౌజ్లు సైతం ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో పాతవాటితోనే పనిచేస్తున్నామని వాపోతున్నారు.
గనుల్లో 35 ఏండ్ల క్రితం కట్టిన బారికేడ్లు సైతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని, రక్షణ పరికరాల సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఉన్నవాటితోనే పనిచేయాల్సి వస్తున్నదని మండిపడుతున్నారు. బొగ్గు ఉత్పత్తి ప్రధానంగా యంత్రాలపై ఆధారపడుతున్నా వాటికి అవసరమైనా విడిభాగాలు అందుబాటులో లేకపోవడంతో యంత్రాలు తరచూ నిలిచిపోగా.. కొన్ని డంపర్లు వర్షాపులకే పరిమితమవుతున్నాయి. కేటీకే ఓసీ-3లో పూర్తిగా కాలం చెల్లిన వాహనాలనే నడిపిస్తుడటంతో అనేక ప్రమాదాలు జరిగిన సందర్భాలున్నాయి. రోజుకు కనీసం 18నుంచి 20 ట్రిప్పులు రవాణా చేసే డంపర్లు రోజుల తరబడి నిలిచిపోవడంతో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. బొగ్గుత్పత్తి కోసం కార్మికులపై ఒత్తిడి తీసుకువస్తున్న యాజమాన్యం గనిలోపల పనిస్థలాల్లో అవసరమైన రక్షణ పనిముట్లను సకాలంలో అందించడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.
గనుల్లో పనిచేసే స్థలాల్లో సింగరేణి యాజమాన్యం రక్షణ పరికరాలు అందజేయకుండా కార్మికుల ప్రాణాలతో ఆడుకుంటున్నది. డ్రిల్రాడ్లు, బిట్లు, పైకప్పు సపోర్టులు లేక సపోర్టుమెన్లు,లైన్మెన్లు, టింబర్మెటన్లు ఇబ్బందులుపడుతున్నారు. పాతవాటితో పనులు చేయించడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురై కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాలంచెల్లిన యంత్రాలను పూర్తిగా తీసివేసి, వాటిస్థానంలో కొత్తవి తేవాలి.
– బడితల సమ్మయ్య, టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు