పెద్దపల్లి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) కార్మికులకు కేంద్ర ప్రభుత్వం, కోల్ ఇండియా యాజమాన్యం 12వ వేతన ఒప్పందంపై తీవ్ర జాప్యం చేస్తున్నాయి. 1 జూలై 2026 నుంచి అమల్లోకి రావాల్సిన వేతన ఒప్పందంపై ఇంతవరకు చర్చలే ప్రారంభించకపోవడంపై కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. గడువు ముగిసినప్పటికీ జాయింట్ బై పార్టీ కమిటీ ఫర్ కోల్ ఇండస్ట్రీస్ (జేబీసీసీఐ) వేతన స్థిరీకరణ కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో రాష్ట్రంలోని 45 వేల మంది కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల్లో ఆందోళన నెలకొన్నది.
కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను అమలు చేస్తేనే వేతన చర్చలు అంటూ కోల్ ఇండియా యాజమాన్యం కాలయాపన చేస్తున్నది. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను సింగరేణిలోని టీబీజీకేఎస్, ఏఐటీయూ, ఐఎన్టీయూసీలు వ్యతిరేకిస్తున్నాయి. 1967 నుంచి ప్రతి ఐదేండ్లకోసారి సకాలంలో వేతన ఒప్పందం జరిగేది. లేబర్ కోడ్లతో సంబంధం లేకుండానే కేంద్రం కార్మిక సంఘాల ప్రతినిధులతో జేబీసీసీఐని ఏర్పాటు చేయాలని, లేకపోతే వచ్చే నెల 12న ఢిల్లీలో జాతీయస్థాయి కార్మిక సదస్సు నిర్వహించి కార్యాచరణ ప్రకటించాలని ప్రధాన సంఘాలు నిర్ణయించాయి.
దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల కార్మికులకు అమలు చేయాల్సిన వేతనాలు, అలవెన్స్ను ఖరారు చేసేందుకు కేంద్రం, కోల్ ఇండియా కార్మికసంఘాలతో 1967 నుంచి జేబీసీసీఐ ఏర్పాటు చేసింది. 1వ వేజ్ బోర్డు 1 జనవరి 1975 నుంచి 31 డిసెంబర్ 1978 కాలాన్ని నిర్ణయించారు. 12వ వేజ్ బోర్డు 1 జూలై 2026 నుంచి అమల్లోకి రావాలి. జేబీసీసీఐ ఏర్పాటు చేసి, 12వ వేతన చర్చలు ప్రారంభించాలని, లేకుంటే సింగరేణి నుంచి జాతీయ స్థాయి వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.