వరంగల్, అక్టోబర్ 26(నమస్తేతెలంగాణ): వర్షపు నీటిని సంరక్షించి ఇంకుడు గుంత లేదా చెరువులోకి మళ్లించడం సర్వసాధారణం. వరంగల్ జిల్లా నర్సంపేటలోని సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. ధర్మరావుపేట ప్రభుత్వ పాఠశాలలో వర్షపు నీటిని ఒడిసిపట్టి తాగునీరుగా మార్చే ప్రాజెక్టును రూపొందించి సఫలమయ్యారు. ఆ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రస్తుతం ఇదే నీటిని తాగుతున్నారు.
ధర్మరావుపేట పాఠశాలలో..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడేలా వర్షపు నీటిని తాగునీటిగా మార్చే ప్రాజెక్టును చేపట్టేందుకు నర్సంపేటలోని సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొంగళ్ల అశోక్ ప్రతిపాదన చేశారు. కలెక్టర్ ఆమోదం తెలుపడంతో ఖానాపురం మండలం ధర్మరావుపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ప్రక్రియను చేపట్టారు. ఇందుకోసం రూ.1,62,712 వెచ్చించారు. ఇందులో డీఆర్డీఏ రూ.లక్ష ఇవ్వగా సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు రూ.42,612 సమకూర్చారు. మరో రూ.20 వేలు శ్రమదానం ద్వారా సేకరించి ప్రాజెక్టును పూర్తి చేశారు.
ప్రాజెక్టు నిర్మాణం తీరిది..
వర్షపు నీటిని సేకరించేందుకు ధర్మరావుపేట ఉన్నత పాఠశాల భవనంపై 1,600 అడుగుల క్యాచ్ ఏరియాలో చుట్టూ నాలుగు ఇంచుల వెడల్పు, ఆరు ఇంచుల ఎత్తు ఇటుకతో గోడ కట్టారు. వాన పడగానే స్లాబుపై ఒక వైపు వచ్చే నీరు గ్రావిటీ పద్ధతిన కిందకు వెళ్లేలా ప్లాస్టిక్ పైపులను అమర్చారు. ఈ పైపుల నుంచి వచ్చే నీటిని నిల్వ చేసేందుకు పాఠశాల ఆవరణలో నేలపై మూడు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల ఎత్తుతో 1,420 లీటర్ల సామర్థ్యం గల మినరల్ ట్యాంక్ నిర్మించారు. ఈ ట్యాంకులో కింద నుంచి వరసగా పెద్దసైజు సున్నపురాయి, ఇసుక, ఇటుక ముక్కలు, కర్రబొగ్గు, ఇసుక, చిన్నసైజు సున్నపురాయి ఇలా ఒకదానిపై ఒకటి పోశారు. దీని సమీపంలో భూమిలో ఎనిమిది అడుగుల లోతు, నాలుగు అడుగుల వెడల్పుతో కూడిన ఆరు వేల లీటర్ల సామర్థ్యం గల స్టోరేజీ సంప్ నిర్మించారు. ఒక పైపుద్వారా నీరు మినరల్స్ ట్యాంక్ నుంచి సంప్లోకి చేరుతుంది. గాలి, వెలుతురు, పురుగులేవీ వెళ్లకుండా సంప్నకు మూత బిగించి దీనికి విద్యుత్ మోటర్ అమర్చారు. ఇది ఆన్ చేయగానే సంప్ నుంచి నీరు బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. క్యాన్లు, బాటిళ్లలోనూ ఈ నీటిని పట్టుకోవచ్చు. వాన నీటిని ఒడిసిపట్టి తాగునీరుగా మార్చే ప్రాజెక్టు రాష్ట్రంలో ఇదే మొదటిది కావటం విశేషం. ఇంజినీర్లు లేకుండా కేవలం యువకులే సొంతంగా దీన్ని నిర్మించారు. మోడల్ ప్రాజెక్టును గత సెప్టెంబర్ 16న కలెక్టర్ బి గోపితో కలిసి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వాన నీటిని ఒడిసిపట్టి తాగునీరుగా మార్చే సరికొత్త ప్రాజెక్టును నిర్మించిన యూత్ సభ్యులను అభినందించారు.
ఈ నీటిని తాగొచ్చు: ఆర్డబ్ల్యూఎస్
సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్ నిర్మించిన మోడల్ ప్రాజెక్టు నీటిని తాగొచ్చని గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్) కూడా ధ్రువీకరించింది. ప్రస్తుతం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ నీటినే తాగుతున్నారు. ఒకసారి స్టోరేజీ పంపులో నిల్వ చేసిన నీరు ఈ పాఠశాలకు మూడు నెలలపాటు సరిపోతుందని అధికారులు అంచనా వేశారు. దీని నిర్వహణకు ఎలాంటి ఖర్చు లేదు. పాఠశాల భవనం స్లాబు పరిశుభ్రంగా ఉంచుకోవటంతోపాటు వర్షం పడినప్పుడు మినరల్స్ ట్యాంకులోకి వెళ్లేలా గేట్ వాల్వ్ ఆన్ చేయాల్సి ఉంటుంది.