కోస్గి, నవంబర్ 17 : కోస్గి మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికే దక్కుతుందని భూగర్భ, గనులశాఖల మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కోస్గి మున్సిపాలిటీలోని 9వ వార్డు బీఆర్ఎస్ నాయకుడు వెంకట్నర్సింహులు ఆధ్వర్యంలో సంపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ యువ కార్యకర్తలు 100మంది మంత్రి మహేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువత బీఆ ర్ఎస్ చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లి కారుగుర్తుకు ఓటు వేయాలని అవగాహన కల్పించాలని కోరారు. కోస్గి మున్సిపాలిటీకి మంత్రి కేటీఆర్ చొరవతో రూ.80 కోట్ల నిధులు తీసుకొచ్చి అన్నివిధాలుగా అభివృద్ధి చేశామన్నారు. బస్డిపో, 50 పడుకల దవాఖాన సీసీ రోడ్లు, పార్కులు, రోడ్డు వెడల్పు పనులు, నేషనల్ హైవే, మున్సిపాలిటీ భవనం, కూరగాయల మార్కెట్ వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
ఐదేండ్లలోనే ఊహించని అభివృద్ధి చేశామని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మరోసారి ఆదరిస్తే మరింత ప్రగతి చేస్తామన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని గెలిపిస్తే ఉన్నత పదవి ఇస్తామని మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారని, ప్రజలు అభివృద్ధి కోసం బీఆర్ఎస్కు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం 8వ వార్డులో పర్యటించి కారుగుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయొద్దీన్, మున్సిపల్ అధ్యక్షుడు రాజేశ్, కౌన్సిలర్లు జనార్ధన్, శ్రీనివాస్, బాలే శ్, నాయకులు సాయిలు, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.