సిటీబ్యూరో, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ): జైలు నుంచి విడుదలైన ఐదు రోజులకే మళ్లీ చోరీలకు తెగబడ్డాడు. ఓ ఫ్లాట్లో 70 తులాల బంగారు నగలను దోచుకున్నాడు. శనివారం ఆ నిందితుడిని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. బషీర్బాగ్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్ తెలిపిన వివరాల ప్రకారం..అక్టోబర్ 21న దోమలగూడ గగన్ మహల్ స్వామి నిలయం అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నం. 302లో చోరీ జరిగింది. కేసు దర్యాప్తు చేసిన చిక్కడిపల్లి పోలీసులు.. సీసీ కెమెరాల ద్వారా సేకరించిన దృశ్యాలను ఫేషీయల్ రికగ్నిషన్ ద్వారా నిందితుడు పాత నేరస్తుడు సుధాకర్ అలియాస్ డేంజర్గా నిర్ధారించి.. శనివారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన అనుచరుడు మహ్మద్ అయూబ్ అలియాస్ బడా అయూబ్తో కలిసి దొంగతనం చేశానని.. ఒప్పుకోవడంతో 41 తులాల సొత్తును రికవరీ చేశారు.
సుధాకర్తో పాటు నగలు విక్రయిస్తున్న అతడి భార్య నాగమణి, అయూబ్లను అరెస్టు చేశారు. ఆభరణాలను కొనుగోలు చేసిన రిసీవర్ మహ్మద్ తబ్రేజ్ దావుద్ షేక్ పరారీలో ఉన్నాడు. అతడి వద్ద 29 తులాల ఆభరణాలు ఉన్నట్లు తేలింది. కర్నూలుకు చెందిన సుధాకర్పై తెలంగాణ, ఏపీలో దాదాపు 59 కేసులు నమోదయ్యాయి. 17 కేసుల్లో జైలు శిక్షలను అనుభవించాడు. హైదరాబాద్ పోలీసులు రెండు సార్లు పీడీ యాక్ట్ను విధించారు. మహ్మద్ అయూబ్ 120 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రెండు సార్లు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు అధికారులు పీడీ యాక్ట్ను విధించారని సీపీ వివరించారు. ఈ చోరీ కేసు మిస్టరీని చేధించిన చిక్కడిపల్లి పోలీసులను సీపీ అంజనీకుమార్ ప్రశంసించి.. రివార్డులను అందించారు.