దుండిగల్,జనవరి 26 : ఆర్థిక బాధలు తాళలేని ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… మెదక్ జిల్లా చిల్పచేడు గ్రామానికి చెందిన గోపీనారాయణ(41), విజయలక్ష్మి దంపతులు. వీరికి కొడుకు సాయిచరణ్, కూతురు శృతి ఉన్నారు. తొమ్మిదేండ్ల క్రితం నగరానికి వలస వచ్చి దుండిగల్ మున్సిపాలిటీ పరిధి… బౌరంపేటలోని బొగ్గులకుంట కాలనీలో నివాసముంటున్నారు. దంపతులు ఇద్దరు ఓ ఫౌల్ట్రీఫామ్లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో నారాయణ కుటుంబం కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. దీనికి తోడు ద్విచక్రవాహనం ఈఎంఐ చెల్లించకపోవడంతో రెండురోజుల క్రితం ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకులు జప్తు చేశారు. దీంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన నారాయణ బుధవారం ఉదయం ఓ బాటిల్లో పెట్రోల్ తీసుకుని గ్రామానికి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లాడు. అనంతరం పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొదట అనుమానాస్పద మృతిగా పోలీసులు భావించినప్పటికీ మృతుడి కొడుకు తన తండ్రి ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.