సిటీబ్యూరో, జనవరి 22(నమస్తే తెలంగాణ): కరోనా నియంత్రణపై రెండు రోజులుగా జ్వర సర్వే, కొవిడ్ పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ‘టీకా వేసుకున్నారా? మాస్క్ ధరించండి.. జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలుంటే చెప్పండి..! జాగ్రత్తగా ఉండండి..’ అంటూ ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ జ్వర పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఇంటింటికి వెళ్లి స్వయంగా జ్వర సర్వేను పరిశీలిస్తూ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. సర్వేలో మాటామంతి కలుపుతూ కరోనా నియంత్రణలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అధికార యంత్రాంగం ముందుకు సాగుతున్నది.
గ్రేటర్లో ఇంటింటికీ 1440 బృందాలు
గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన 1440 బృందాలు ఇంటింటికీ తిరిగి జ్వరం, కొవిడ్ లక్షణాలున్న వారి వివరాలను సేకరిస్తూ, సర్వే చేస్తున్నారు. శనివారం సుమారు 27 వేల ఇండ్లలో జ్వర పరీక్షలు నిర్వహించారు. ఇందులో సుమారు 1200 మంది జ్వరంతో ఉన్నట్లు గుర్తించి, వారికి వెంటనే మందుల కిట్లను అందజేశారు. సికింద్రాబాద్, ఎల్బీనగర్ జోన్లలో ఎక్కువగా జ్వరంతో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది. కాగా, ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే వారికి వెంటనే మందులు అందజేయడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జ్వరం తీవ్రతను బట్టి ఐసొలేషన్లో ఉంచడం, ఐసొలేషన్ సౌకర్యం లేకపోతే సమీపంలో గుర్తించిన కేంద్రాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఫీవర్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఎంటమాలజజీ సిబ్బంది సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేస్తున్నారు. ఇండ్లు, స్కూళ్లు, కాలేజీలు, చర్చీలు, ప్రార్థనా మందిరాలు, బస్టాప్లు, రైల్వే స్టేషన్లు, ఫంక్షన్ హాళ్లలో విస్తృతంగా స్ప్రే చేస్తున్నారు.
ఆర్యోగ తెలంగాణే సీఎం ధ్యేయం: మంత్రి తలసాని
ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ప్రజారోగ్యం కోసమే ప్రభుత్వం ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నదని మంత్రి తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మేదర బస్తీలో, అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని ఎంసీహెచ్ క్వార్టర్స్లో చేపట్టిన సర్వేను మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్తో కలిసి శనివారం పరిశీలించారు.
ఈ విధమైన ఫీవర్ సర్వే దేశంలో ఎకడా జరగడం లేదని మంత్రి అన్నారు. సర్వే కోసం వచ్చే అధికార యంత్రాంగానికి సహకరించాలని మంత్రి ప్రజలను కోరారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్లు ఇంటి వద్దే ఉంటూ ప్రభుత్వం అందించే కిట్లోని మందులను వాడుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, నార్త్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అంబర్పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, డీసీ వేణుగోపాల్, డాక్టర్ గీతారాణి, గురు ప్రసాద్ పాల్గొన్నారు.
మేడ్చల్లో 4249 కిట్ల పంపిణీ
మేడ్చల్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో శనివారం నిర్వహించిన ఫీవర్ సర్వేలో 4,249 మందికి హోం ఐసొలేషన్ కిట్లను అందజేశారు. 869 వైద్య బృందాలు 74,126 ఇళ్లలో ఫీవర్ సర్వే చేసినట్లు జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు అవసరమైతే గాంధీ దవాఖానకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.