హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంటకు అవసరానికి మించి వేస్తున్న ఎరువులు వృథా అవుతున్నాయి. భూమిలో రసాయనిక ఎరువుల నిల్వలు పేరుకుపోవడంతో పాటు రైతుకు పెట్టుబడి భారం పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో పంట పొలాల్లో పేరుకుపోయి.. నిరుపయోగంగా ఉన్న ఎరువులను వినియోగంలోకి తీసుకురావడంపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. అందులో భాగంగానే పొలాల్లో పేరుకుపొయిన భాస్వరం(ఫాస్పరస్) నిల్వలను కరిగించడంపై రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది.
పొలాల్లో భాస్వరం నిల్వలపై జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ తాజాగా ఓ సర్వే చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 6వేల మట్టి నమూనాలను సేకరించి పరీక్షించింది. 53 శాతం నేలల్లో అధిక భాస్వరం నిల్వలు ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలోని మొత్తం 546 మండలాల్లో 208 మండలాల్లో అధిక భాస్వరం నిల్వలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 54 మండలాల్లో ఓ మోస్తరు నిల్వలు ఉండగా, 154 మండలాల్లో అత్యధిక స్థాయిలో ఉన్నట్టు తేల్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని భూముల్లో భాస్వరం నిల్వలు ఉన్నప్పటికీ ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 90శాతం కన్నా ఎక్కువ మండలాల్లో భాస్వరం నిల్వలు అధికంగా ఉన్నట్టు తేల్చారు. నిజామాబాద్లో 27 మండలాలకు గానూ 26 మండలాల్లో, కామారెడ్డి జిల్లాల్లో 22 మండలాలకుగానూ 20 మండలాల్లో, కరీంనగర్లో ఉన్న 16 మండలాల్లో, పెద్దపల్లిలో ఉన్న 14 మండలాల్లో, సిరిసిల్లలో ఉన్న 13 మండలాల్లో అధిక భాస్వరం నిల్వలు ఉన్నాయి.
పంటకు అవసరమైన భాస్వరం(పాస్పరస్)ను డీఏపీ లేదా కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అందిస్తారు. కేవలం 15-20శాతం ఎరువును మాత్రమే పంట వినియోగించుకుంటున్నది. మిగిలిన 80శాతం కరగని స్థితిలో భూమి పొరల్లో ఉండిపోతుంది. దాంతో భూమి పొరల్లో భారీగా భాస్వరం నిల్వలు పేరుకుపోతున్నాయి. అయినప్పటికీ రైతులు మాత్రం విచ్చల విడిగా ఎరువులను వినియోగిస్తూనే ఉన్నారు.
దేశంలో వినియోగించే ఎరువుల తయారీకి అవసరమైన ముడి సరుకు మెజార్టీగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఇటీవల ఉక్రెయిన్, రష్యా యుద్దం, ఇతర కారణాలతో ముడి సరుకు ధరలు భారీగా పెరిగాయి. దాంతో ఎరువులు ధరలను కూడా కేంద్రం భారీగా పెంచింది. ఈ నేపథ్యంలో ఎరువులు వినియోగం తగ్గించడం వల్ల పెట్టుబడి ఖర్చును ఆదా చేసుకోవచ్చని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. అందుకు పొలాల్లో పేరుకుపొయిన భాస్వరం నిల్వలను కరిగించడంపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు.
భాస్వరం నిల్వలను కరిగించి మళ్లీ పంటకు ఉపయోగపడేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఫాస్పేట్ సాల్యుబింగ్ బ్యాక్టీరియా(పీఎస్బీ) తయారు చేశారు. పౌడర్, ద్రవ రూపంలో పీఎస్బీ కేజీ రూ.120 చొప్పున అన్ని ఎరువుల షాపుల్లో లభిస్తుంది. ఒక కిలో పీఎస్బీని.. 150 కేజీల పశువుల ఎరువు లేదా తెలంగాణ సిరి, వర్మి కంపోస్ట్, చెరువు మట్టికి కలిపి ఒక రోజంతా నీడలో ఉంచాలి. ఈ మిశ్రమాన్ని దుక్కి దున్నిన తర్వాత పొలంలో చల్లాలి. ఈ మిశ్రమం భూమిని గుల్లగా మార్చి.. పొరల్లో పేరుకుపోయిన భాస్వరం నిల్వలను కరిగిస్తుంది. ఈ కరిగిన భాస్వరం నిల్వలను పంటకు అందేలా చేస్తుంది.
ఎకరం పొలానికి 2 కేజీల పీఎస్బీ అవసరం అవుతుంది. ఇది నెలలో 30 నుంచి 40 కేజీల భాస్వరం నిల్వలను కరిగిస్తుంది. అంటే ఎకరాకు రూ. 240 ఖర్చు చేస్తే.. ఒక డీఏపీ బస్తా ఎరువు చల్లాల్సిన అవసరం లేకుండా అవసరమైన భాస్వరం పంటకు అందుతుంది. అంటే రైతు ఒక డీఏపీ బస్తాకు చేసే ఖర్చు రూ.1350 మిగులుతుంది. తద్వారా రైతుకు పంట పెట్టుబడి ఖర్చు ఆదా అవుతుంది.
భాస్వరం నిల్వలను కరిగించడంపై రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించాం. క్షేత్రస్థాయిలో రైతు వేదికల్లో ఇందుకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం. పీఎస్బీని అన్ని ఎరువుల షాపుల్లో అందుబాటులో ఉంచాలని ఇప్పటికే యజమానులను ఆదేశించాం. రైతులకు పీఎస్బీ ప్రయోజనాల గురించి చెప్పాలని సూచించాం. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లోనూ పీఎస్బీ లభిస్తుంది.
– ఆగ్రోస్ ఎండీ రాములు
రాష్ట్రంలోని 208 మండలాలు, ఆరు జిల్లాల్లో అత్యధికంగా భాస్వరం నిల్వలు ఉన్నట్టు తేలింది. భాస్వరం నిల్వలు కరిగించడంపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలపై వ్యవసాయ శాఖతో కలిసి పని చేస్తున్నాం.
– పరిశోధన విభాగం డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వర్