న్యూఢిల్లీ: పదేండ్ల క్రితం నిర్భయ ఘటనతో, ఇటీవల శ్రద్ధా వాకర్ ఘటనతో కలకలం రేగిన ఢిల్లీలో తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. ఇవాళ ఓ బాలుడు.. పాఠశాలకు వెళ్తున్న బాలికపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆమెను హుటాహుటిన సఫ్దర్గంజ్ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలిక నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని ద్వారక జిల్లా ఏరియాలో యాసిడ్ దాడి ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే, ఘటనకుగల కారణాలు తెలియాల్సి ఉంది. యాసిడ్ దాడికి పాల్పడిన బాలుడు ఎవరు..? అతను కూడా బాలికతోపాటు అదే పాఠశాలలలో చదువుతున్నాడా..? లేదంటే బయటి వ్యక్తా..? అతను బాలికపై ఎందుకు యాసిడ్ దాడి చేయాల్సి వచ్చింది..? అనే కోణాల్లో తాము కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు.