మేడ్చల్, నవంబర్16(నమస్తే తెలంగాణ): ఎస్సీ సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు ప్రభుత్వం రూ.51 లక్షలు మంజూరు చేసింది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 9 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు మంజూరైన నిధులతో మరమ్మతులు, మౌలిక వసతులు కల్పించనున్నారు. కొవిడ్ నేపథ్యంలో సంక్షేమ వసతి గృహాలను ఎడాదిన్నర కాలంగా మూసివేసిన విషయం విధితమే. వసతి గృహాలను ప్రభుత్వం పునఃప్రారంభించడంతో వసతి గృహాల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మరమ్మతులు చేపట్టారు. అవసరం ఉన్న చోట స్నానపు గదులు, వంటశాలలు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం, ప్రహరీలను నిర్మిస్తున్నారు.
మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్లో 2, శామీర్పేట్ 1, మేడ్చల్ 2, బహుదూర్పల్లి 1, దుండిగల్ 1, యాప్రాల్లో ఎస్సీ సంక్షేమ వసతి గృహాలున్నాయి. 302 మంది విద్యార్థులు వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కావడంతో వసతి గృహాలను ప్రారంభించారు. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో వసతి గృహాల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదని, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అభివృద్ధి అధికారి వినోద్కుమార్ వెల్లడించారు. వారం రోజుల్లో 9 వసతి గృహాల్లో మరమ్మతులు, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి కానున్నట్లు వెల్లడించారు. అవసరమైతే మరిన్ని నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.