జైసల్మేర్: ‘ప్రేమకు సరిహద్దుల్లేవు’ అనే సామెత రోమాంటిక్ నవలల్లో మాత్రమే కాదు.. నిజ జీవితంలోనూ దానికి విలువ ఉంటుంది.. దీనితో ప్రతి ఒక్కరూ అంగీకరించినా.. అంగీకరించకున్నా.. రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతంలో కుల్ధారాలో గేట్ కీపర్గా కొనసాగిన ఓ 82 ఏండ్ల వయస్సు గల వృద్ధుడి ప్రేమగాథ చదివితే.. పురాతన కాలం నాటి ఈ సామెతకు గల విలువ అర్ధం అవుతుంది.. హ్యూమన్స్ ఆఫ్ బాంబే నిర్వాహకులు.. సదరు వృద్ధుడి ఇంటర్వ్యూను వారి సోషల్ మీడియా ఖాతాల్లో గురువారం పోస్ట్ చేశారు. త్వరలో ఆస్ట్రేలియాకు చెందిన సదరు యువతి తన మనస్సును చూరగొన్న ప్రేమికుడి కోసం భారత్కు రానున్నారు..
ఈ నేపథ్యంలో హ్యూమన్స్ ఆఫ్ బాంబే నిర్వాహకులు పోస్ట్ చేసిన ఈ ప్రేమ గాధ సోషల్ మీడియాలో వైరలైంది.. వేల మంది నెటిజన్లు వారి ప్రేమకథ తెలుసుకోవడంతోపాటు మరీనా ఫోటో కావాలని పోస్ట్లు పెడుతున్నారు. 50 ఏండ్ల క్రితం నాటి తొలి ప్రేమ జంట భవిష్యత్ భేటీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
1970వ దశకంలో అంటే 30 ఏండ్ల వయస్సులో ఆయన గేట్ కీపర్గా జీవనం సాగిస్తున్నారు. అప్పుడే మరీనా అనే ఆస్ట్రేలియన్ యువతి.. కేవలం ఐదు రోజుల ట్రిప్ కోసం జై సల్మేర్కు వచ్చారు. తొలి చూపుల్లోనూ తమ మధ్య ప్రేమ చిగురించింది అని ఈ వ్రుద్ధుడు గుర్తు చేసుకున్నారు. ఐదు రోజులు ఆమె జైసల్మేర్ ఉన్నప్పుడు తాము ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయామని చెప్పాడు.
ఐదు రోజుల ట్రిప్ పూర్తయి ఆస్ట్రేలియాకు వెళుతున్నప్పుడు ఆమె.. ఐ లవ్ యూ అని చెప్పడంతో తన భావాలన్నీ తనతో పంచుకున్నారని ఆయన వెల్లడించారు. ఆమె ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు తాను సిగ్గుపడిపోయానని అన్నారు. తర్వాత తామిద్దరం చాలా కాలం లెటర్లతో టచ్లో ఉన్నామని గుర్తు చేసుకున్నాడు.
కుటుంబానికి చెప్పకుండానే రూ.30 వేలు అప్పు చేసి.. పాస్పోర్ట్.. మూడు నెలల వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లానని తెలిపాడు. ఆమె తనకు ఇంగ్లీష్లో మాట్లాడటం కూడా నేర్పిందన్నారు. ఆమెను పెండ్లి చేసుకుని అక్కడే సెటిల్ కావాలని నిర్ణయించుకున్నా.. పరిస్థితులు తారుమారయ్యాయన్నాడు.
ఆమె ఒప్పుకుంటే వివాహం చేసుకునేందుకు సిద్ధ పడినా.. రాజస్థాన్లోని తన కుటుంబాన్ని వీడలేక తానూ.. భారత్కు ఆమె రాలేక విడిపోయామని ఈ ప్రేమికుడు వ్యాఖ్యానించాడు. కుటుంబం ఒత్తిడితో తర్వాత పెండ్లి చేసుకున్నాడు. తర్వాత కూడా తరుచుగా ఆమె పెండ్లి చేసుకుందా? అని ఆలోచించే వాడినన్నాడు. కానీ ఆమెకు లెటర్ రాయడానికి ధైర్యం చేయలేదని చెప్పాడు.
50 ఏండ్ల తర్వాత తన గురించి తెలుసుకుని.. నెల రోజుల క్రితం ఒక లేఖ రాశారని.. అప్పటి నుంచి తాము ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడుకుంటున్నట్లు తెలిపాడు. తనను ప్రేమించిన మరీనా ఇప్పటికీ అవివాహితగానే ఉందని, త్వరలో భారత్కు రాబోతుందని చెప్పాడు.. ఈ వార్త తెలిసినప్పటి నుంచి తాను 21 ఏండ్ల యువకుడినయ్యానన్న అభిప్రాయం కలుగుతుందన్నాడు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం