హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 767 కొత్త కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపింది. మహమ్మారి నుంచి తాజాగా 848 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ ప్రభావంతో మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,33,146కు చేరగా.. మొత్తం 6,19,344 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి 3,738 మంది మృత్యువాతపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 10,064 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 97.82శాతానికి చేరుకుందని, మరణాలు రేటు 0.59 శాతంగా ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఒకే రోజు 1,18,778 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఖమ్మంలో 84, జీహెచ్ఎంసీలో 77, మంచిర్యాలలో 65, పెద్దపల్లిలో 59, నల్లగొండలో 52, కరీంనగర్లో 51, రంగారెడ్డిలో 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పింది.