బడంగ్పేట:చెరువులను సుందరీకరణ చేయకుండా కొంత మంది రాజకీయ నాయకులు అడ్డు పడుతున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మీర్పేట పెద్ద చెరువు సుందరీకరణ పనులను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీర్పేట పెద్ద చెరువును నూతన హంగులతో అభివృద్ధి చేయడానికి రూ.6.20 కోట్లు కెటాయించడం జరిగిందన్నారు.
చెరువులను ఎలా అభివృద్ధి చేయాలో సూచనలు సలహాలు ఇవ్వాలని కాని అభివృద్ధిని అడ్డుకోవడం మంచి పద్దతి కాదన్నారు. నాయకులు ఎవరైనా రాజకీయాలను కలుషితం చేయకూడదని మంత్రి సూచించారు. బాలాపూర్ మండలంలో ఉన్న 62 గోలుసు కట్టు చెరువులను పూర్వీకులు మనకు అందించారని ఆమె గుర్తు చేశారు. అలాంటి చెరువులను భవిష్యత్ తరాల కోసం కాపాడ వలసిన అవసరం ఉందన్నారు.
ఇప్పటికే చాలా చెరువులు కబ్జా అయిన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఉన్న వాటిని సంరక్షించి అభివృద్ధి చేయడానికి సహక రించాలన్నారు. సుందరీకరణ పేరుతో చెరువులు కబ్జా అవుతున్నట్లు అధికారులకు తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని ఆమె అన్నారు. చెరువులను బాగు చేసి భవిష్యత్ తరాలకు అంబదజేయాలన్నదే రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు. చెరువులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నారు. అవసరం అయిన నిధులు కెటాయిస్తున్నందుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
చెరువులు కలుషితం కాకుండా ఉండటానికి రూ.23 కోట్లతో ట్రంక్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వర్షం నీరు ను ట్రంక్లైన్లో కలపవద్దని ఆమె అధికారులకు సూచించారు. ఇటీవల బీఎన్రెడ్డి నుంచి మరో ట్రంక్ లైన్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ రూ.23 కోట్లు కెటాయించారని ఆమె గుర్తుచేశారు.
రానున్న రోజుల్లో డ్రైనేజీ రాకుండా ఉండటానికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందన్నారు. చెరువుల పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలకు ముంపు సమస్య రాకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆమె అన్నారు. బాలాపూర్లో ఉన్న చెరువులను దశల వారిగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
జల్పల్లి పెద్ద చెరువును రూ.9 కోట్లతో సుందరీకరణ చేస్తున్నామన్నారు. జిల్లెలగూడ సందచెరువు రూ.6 కోట్లతో, అల్మాస్ గూడ పోచమ్మకుంట రూ.1కోటీ, కోమటి కుంటకు రూ.1కోటి, బాలాపూర్ పెద్ద చెరువు కు రూ.1 కోటీ, నాదర్గుల్కు 1కోటి నిధులతో అభివృద్ధి చేస్తుంటే ప్రతి పక్ష పార్టీలు రాజకీయాలు చేయడం తగదు అన్నారు. అందరూ సహకరిస్తే చెరువులను ఆహ్లాద కరంగా తీర్చిదిద్దుతామన్నారు. చెరువుల చుట్టు గ్రీనరీ, పార్కులు, యోగా కేంద్రాలు, చిల్డ్రన్ పార్కులు, వాకింగ్ట్రాక్లు, ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేయిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ హన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, తాసీల్ధార్, ఇన్చార్జీ కమిషనర్ డి శ్రీనివాస్ రెడ్డి, హెచ్ఎండిఎ ఎస్ఇ సేన్, ఇఇ రమేష్, డిఈ ధన్ మోహన్, ఎఇ స్థానిక కార్పొరేటర్స్ ధనలక్ష్మి రాజు, అరుణ ప్రభాకర్రెడ్డి, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రావన్ ,అధ్యక్షురాలు సిద్దాల లావణ్య తదితరులు ఉన్నారు.